తెలంగాణ రాజకీయ పోరుగడ్డపై మరోసారి సింహం గర్జించింది. గత రెండేళ్లుగా మౌనంగా ఉన్న గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మౌనాన్ని వీడారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఇంతకాలం ప్రజా తీర్పును గౌరవించి సమయం ఇచ్చాను.. కానీ ఇకపై కథ వేరే ఉంటది, అన్యాయం జరిగితే తోలు తీస్తా’ అంటూ విసిరిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచాయి.
మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి కష్టాల గురించి కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. 100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్నప్పటికీ.. పాలమూరు జిల్లా దశాబ్దాల పాటు వివక్షకు ఎలా గురైందో ఆయన గుర్తు చేశారు. 1974లోనే బచావత్ ట్రిబ్యునల్ జూరాలకు 17 టీఎంసీల నీటిని కేటాయించినా.. ఉమ్మడి రాష్ట్ర పాలకులు దాన్ని అనాథ బ్యారేజీగా మార్చారని మండిపడ్డారు. మహబూబ్ నగర్ను దత్తత తీసుకున్నానని చెప్పిన చంద్రబాబు.. కేవలం పునాది రాళ్లకే పరిమితమయ్యారని విమర్శించారు. కనీసం కర్ణాటకకు చెల్లించాల్సిన పరిహారం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. సాగునీరు లేక ప్రతి నియోజకవర్గం నుంచి ముంబైకి బస్సులు ఉండేవని.. జిల్లా ప్రజల వలసల గోస చూసి చలించిపోయి ఉద్యమ కాలంలో పాదయాత్ర చేశానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతో నడుస్తోందని.. అందుకే బాబు మాట విని పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపినా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంపై యుద్ధం చేయాల్సిన పాలకులు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన నిర్ణయించారు. ‘తెలంగాణ తెచ్చిన పార్టీగా మౌనంగా ఉండేది లేదు’ అని చెప్పడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రధానాంశంగా తీసుకుని ప్రజా క్షేత్రంలోకి వెళ్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa