తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అనే అంశం ఇప్పుడు ప్రతి మహిళా ప్రయాణికురాలికి ఒక వరంగా మారింది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తుండటంతో.. ఆర్టీసీ ఆదాయం పెరగడమే కాకుండా సామాజికంగా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ పథకం సాధించిన విజయాలను వెల్లడించారు.
ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తూ ప్రయాణిస్తున్నారు. అయితే.. ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి , కచ్చితమైన గణాంకాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు టికెట్ లేకుండా.. కార్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం కుదుర్చుకుని.. రాష్ట్రంలోని ప్రతి అర్హురాలైన మహిళకు ఈ స్మార్ట్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదవ్వడం విశేషం. ఇది రవాణా రంగంలోనే ఒక అతిపెద్ద రికార్డుగా నిలిచింది.
ఆర్టీసీని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద భారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నారు. హైదరాబాద్ నగరానికి 2800 కొత్త విద్యుత్ బస్సులు కేటాయించగా.. నిజామాబాద్, వరంగల్ వంటి పట్టణాలకు మరో 100 బస్సులను కేటాయించారు. ఈ బస్సుల కోసం అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలను, డిపోలను వేగంగా నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ప్రయాణికులకు శబ్దం, కాలుష్యం లేని ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ఆర్టీసీ కేవలం సేవలకే పరిమితం కాకుండా.. ఆర్థికంగా కూడా కోలుకుంటోందని ప్రభుత్వం తెలిపింది.
గతంలో పేరుకుపోయిన పీఎఫ్ బకాయిలను , సీసీఎస్ బకాయిలను భారీగా తగ్గించడం ద్వారా కార్మికులలో నమ్మకాన్ని పెంచారు. కేవలం ఆర్టీసీ మాత్రమే కాకుండా.. రజక, నాయి బ్రాహ్మణ వృత్తుల వారికి ఉచిత విద్యుత్ బిల్లులను సకాలంలో విడుదల చేయాలని, విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు, దుస్తులు అందేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ద్వారా విద్యారంగంలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించబోతున్నారు. ఇప్పటికే మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల విడుదల ద్వారా గురుకుల విద్యార్థుల కష్టాలను కూడా ప్రభుత్వం తీర్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa