ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో మూడో దశ విస్తరణ.. 178.3 కి.మీ వరకు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 09:22 PM

భాగ్యనగర వాసుల చిరకాల స్వప్నమైన వేగవంతమైన ప్రయాణాన్ని సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం నగరంలోని ప్రధాన కూడళ్లకే పరిమితం కాకుండా.. శివారు ప్రాంతాలను కూడా అనుసంధానిస్తూ మెట్రో మూడో దశ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. దీనివల్ల హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. హైదరాబాద్ నగరం రోజురోజుకూ విశ్వనగరంగా విస్తరిస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రహదారులపై ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది.


ప్రభుత్వం ఎన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ వంతెనలు నిర్మించినా వాహనదారుల ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు. ఈ తరుణంలో సురక్షితమైన, వేగవంతమైన మెట్రో ప్రయాణం వైపు నగర ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో సేవలు కేవలం పరిమిత మార్గాల్లోనే ఉండటంతో.. నగరం నలుమూలల నుంచి మెట్రో విస్తరణ కోసం డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా రాబోయే 22 ఏళ్లలో హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను ఏకంగా 400 కిలోమీటర్లకు పైగా విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రెండో దశ విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానుండగా.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడో దశ విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.


రెండో దశలో సుమారు 152.5 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఇక మిగిలిన 178.3 కిలోమీటర్లు మూడో దశలో విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలకు మెట్రో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రస్తుతం సిటీ బస్సుల్లో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలంటే ట్రాఫిక్ కారణంగా సుమారు మూడు గంటల సమయం పడుతోంది. మూడో దశ పూర్తయితే.. శివారు ప్రాంతాలైన మేడ్చల్, పటాన్ చెరువు, ఘటకేసర్, హయాత్ నగర్ వంటి ఏరియాల నుంచి విమానాశ్రయానికి లేదా ఐటీ కారిడార్లకు నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న 400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవాలంటే ఇంకా 330.8 కిలోమీటర్ల మేర పట్టాలు వేయాల్సి ఉంటుంది. అంటే 2047 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే, వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం సగటున 15 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది.


ఇది ఒక భారీ సవాల్ అయినప్పటికీ.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సకాలంలో పనులు పూర్తి చేయాలని యోచిస్తున్నారు. మెట్రో మూడో దశ విస్తరణ వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. సొంత వాహనాల వాడకం తగ్గి, మెట్రో రైళ్లలో ప్రయాణించడం వల్ల ఇంధన ఆదా కూడా సాధ్యమవుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు, విద్యార్థులకు ఈ విస్తరణ ఎంతో ఊరటనిస్తుంది. 2047 నాటికి హైదరాబాద్ నగరం మొత్తం మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానమై.. ప్రపంచ స్థాయి రవాణా సదుపాయం కలిగిన నగరంగా నిలవనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa