బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్కు అహంకారం ముదిరిందని, మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో చేసిన విమర్శలపై కడియం తీవ్రంగా స్పందించారు.తనను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వాడిన పదజాలంపై కడియం తీవ్రంగా స్పందించారు. "మేము ఆడవాళ్లమో, మగవాళ్లమో తెలుసుకోవాలంటే స్టేషన్ ఘన్పూర్కు వచ్చి చూడు బిడ్డా.. ఇక్కడ 143 సర్పంచ్ స్థానాల్లో 100 మందిని గెలిపించుకున్నాం. మీ నాయన కేసీఆర్ కంటే నేను, పోచారం వయసులో రెండేళ్లు పెద్దవారం. నీకంటే మాకు రాజకీయ అనుభవం ఎక్కువ. మీ నాయన పదేళ్లు సీఎం చేస్తే.. నేను 14 ఏళ్లు మంత్రిగా పనిచేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించా. అరే బిడ్డా.. గుర్తుంచుకో, నీకంటే మాకే ఎక్కువ రాజ్యాంగబద్ధమైన అనుభవం ఉంది" అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa