జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ అక్షర హైస్కూల్లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ ద్వితీయ బ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల ఉత్సాహంతో, క్రమశిక్షణతో కూడిన నినాదాలతో మారుమోగిపోయింది. విద్యార్థులలో సేవా భావాన్ని, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, అటు తల్లిదండ్రులను, ఇటు పట్టణ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మెట్టుపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీ కూన గోవర్దన్ మరియు మండల విద్యాధికారి శ్రీ మేకల చంద్రశేఖర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మారుతున్న కాలంలో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, శారీరక దృఢత్వం మరియు మానసిక పరిపక్వత ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్కౌట్స్ & గైడ్స్ వంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు స్పష్టం చేశారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి మరియు నిస్వార్థమైన సంఘసేవ వంటి ఉన్నతమైన లక్షణాలను చిన్నతనం నుంచే అలవాటు చేయాలని అతిథులు సూచించారు. కష్టకాలంలో ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఈ శిక్షణ నేర్పిస్తుందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సమాజంలో ఉత్తమ విలువల ప్రతిస్థాపనకు ఇలాంటి సంస్థలు వెన్నెముకలా నిలుస్తాయని, అక్షర హైస్కూల్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని వారు కొనియాడారు.
ఈ అట్టహాసమైన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక్ష పర్యవేక్షణలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. స్కౌట్ కమీషనర్, గైడ్ కెప్టెన్ నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణా ప్రారంభానికి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పట్టణ ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అందరి సమక్షంలో ద్వితీయ బ్యాచ్ విద్యార్థులు తాము సమాజ సేవకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa