ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలం నాచేపల్లి గ్రామంలో మంగళవారం నాడు పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. నల్గొండ జిల్లాకు చెందిన తూర్పాటి ఎర్రయ్య అనే వ్యక్తి ప్రధాన అనుచరుడిగా ఉంటూ, మరో ఐదుగురితో కలిసి ఈ దొంగ బాబాల ముఠా గ్రామాల్లో తిరుగుతోంది. అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుని, ఇంట్లో దోషాలు ఉన్నాయని, ప్రత్యేక పూజలు చేస్తే అన్నీ తొలగిపోతాయని నమ్మిస్తూ వీరు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా సభ్యులు ప్రధానంగా సంతానం లేని వారికి పిల్లలు కలుగుతారని, ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిస్తామని నమ్మబలికేవారు. ఈ క్రమంలోనే నాచేపల్లి గ్రామానికి చెందిన రేగిల్ల కోటి కోటేశ్వరి అనే మహిళను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఆమె ఇంట్లో దోషాలు ఉన్నాయని భయపెట్టి, పూజలు నిర్వహించాలంటూ ఆమె వద్ద నుండి రూ. 2000 వసూలు చేశారు. అయితే వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన కోటేశ్వరి వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
బాధిత మహిళ ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నాచేపల్లిలో తలదాచుకున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేని మాటలు చెబుతూ, ప్రజల బలహీనతలను పెట్టుబడిగా మార్చుకుంటున్న ఈ ముఠాను విచారిస్తున్నారు. వీరి వద్ద నుండి కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నల్గొండ నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల్లోకి చొరబడి ఇలాంటి మోసాలకు గతంలో ఎక్కడైనా పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ ఘటనపై నేలకొండపల్లి ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చి పూజల పేరుతోనో, తక్కువ ధరకే వస్తువులు ఇస్తామనో నమ్మిస్తే మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా 'బాబాల' వేషధారణలో వచ్చి మాయమాటలు చెప్పే వారిని నమ్మవద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి నేరాలను అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa