పార్లమెంట్లో డ్యామ్ల భద్రతపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ భద్రతపై కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, దీనిని అత్యంత ప్రమాదకరమైన ‘కేటగిరి-1’ డ్యామ్గా ప్రకటించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిర్వహించిన 2025 వర్షాకాలం అనంతర తనిఖీల్లో ఈ ప్రాజెక్టులో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, వీటిని తక్షణమే సరిదిద్దకపోతే బ్యారేజ్ విఫలమయ్యే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా గుర్తించిన మూడు అత్యంత సమస్యాత్మక ప్రాజెక్టులలో మేడిగడ్డ ఒకటిగా ఉంది.ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ పటిష్టతను కాపాడేందుకు NDSA సిఫార్సు చేసిన వివిధ నివారణ, ఉపశమన చర్యలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరీ డ్యామ్, జార్ఖండ్లోని బొకారో బ్యారేజ్ వంటి ఇతర కేటగిరి-1 ప్రాజెక్టులను కేంద్రం తన DRIP-II పథకం ద్వారా పునరావాస పనుల్లో చేర్చగా, మేడిగడ్డ విషయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్రానికి సూచించింది. ప్రాజెక్టు భద్రతను నిర్ధారించడానికి, సంబంధిత విపత్తులను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని కేంద్రం తన నివేదికలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa