ట్రెండింగ్
Epaper    English    தமிழ்

80 లక్షల మరణాలు..గాలి నాణ్యతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 07:44 PM

ఆర్థిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ తోడైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ‘గాలి నాణ్యత నిర్వహణ’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గాలి నాణ్యత అనేది కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాదని, అది ప్రజారోగ్యం మరియు ఆర్థిక ఉత్పాదకతతో ముడిపడి ఉన్న అంశమని ఆయన అభివర్ణించారు.


ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతోందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. అధిక రక్తపోటు తర్వాత మరణాలకు రెండో ప్రధాన కారణం గాలి కాలుష్యమేనని ఆయన పేర్కొన్నారు. ఏటా దాదాపు 80 లక్షల మంది అకాల మరణాలకు గురవుతున్నారని, ఇది పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం.. గాలి కాలుష్యం వల్ల ఏటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. అందుకే కాలుష్య నివారణ కోసం చేసే ఖర్చును పెట్టుబడిగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.


తెలంగాణ ప్రభుత్వ కీలక చర్యలు..


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యతను పరీక్షించే స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేస్తూ.. కొత్తగా 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలో ‘ఎయిర్ క్వాలిటీ డాష్ బోర్డు’లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలుష్య రహిత రవాణా కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా సబ్సిడీలు అందిస్తున్నారు. ఈ-బస్సులు, మెట్రో విస్తరణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలను నిర్మిస్తున్నారు.


పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను పర్యవేక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలి సర్వర్లకు ప్రత్యేక నిఘా వ్యవస్థలను అనుసంధానించారు. నివాస ప్రాంతాల మధ్య ఉన్న పరిశ్రమలపై ప్రత్యేక నిఘా ఉంచారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో గ్రీన్ హైడ్రజన్, సౌర , పవన శక్తి విధానాలను అమలు చేస్తున్నారు. కాలుష్య ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక బృందాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.


హైదరాబాద్ నగరం ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో.. నగర వ్యవస్థలు కూడా అంతే పరిపక్వతతో పర్యావరణాన్ని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ప్రకృతి వనరులను కాపాడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పునరుద్ఘాటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa