ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డింపుల్ కిలేడీ లీలలు,,,,రీల్స్‌లో అలా, రియల్‌గా ఇలా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 07:53 PM

సోషల్ మీడియా అనేది నేడు ఒక మాయా ప్రపంచం. అక్కడ కనిపించేవన్నీ నిజం కావు అని చెప్పడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన హనీట్రాప్ కేసులే నిదర్శనం. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో సంప్రదాయంగా కనిపిస్తూ.. పద్ధతిగా మాట్లాడే కొందరు మహిళలు.. తెర వెనుక ఎంతటి ఘోరాలకు పాల్పడుతున్నారో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది. ముఖ్యంగా ఒక జంట 'ఈజీ మనీ' కోసం పక్కా మాస్టర్ ప్లాన్ తో అమాయకులను ముగ్గులోకి దింపి.. వారి జీవితాలను ఛిద్రం చేసిన తీరు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వారు మాట్లాడే మాటలకు.. చేసిన పనులకు ఎలాంటి సంబంధం లేదంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


రీల్స్ లో వలపు వల.. రియల్ గా బ్లాక్ మెయిల్..


చూసేందుకు ఎంతో అందంగా ఉంటూ, ఖరీదైన దుస్తులతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అప్‌లోడ్ చేస్తూ ఈ కిలాడీ మహిళ పాపులర్ అయ్యింది. ఆమె వీడియోలకు లైక్ కొట్టి, కామెంట్ చేసే వారి ప్రొఫైల్స్‌ను నిశితంగా పరిశీలిస్తారు. ఎవరైతే ధనవంతులు, ప్రముఖ వ్యాపారులుగా కనిపిస్తారో వారిని లక్ష్యంగా చేసుకుంటారు. మొదట స్నేహపూర్వకంగా మెసేజ్ లు పంపి.. ఆ తర్వాత తీయని మాటలతో నమ్మిస్తారు. మెల్లగా వారిని తమ నివాసానికి ఆహ్వానిస్తారు.


అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ దంపతులు నివసించే అపార్ట్‌మెంట్ లోని బెడ్ రూమ్ లో భర్తే స్వయంగా రహస్య కెమెరాలను అమర్చాడు. తన భార్య బాధితులతో ఏకాంతంగా ఉన్న సమయాలను ఆ కెమెరాల్లో చిత్రీకరిస్తారు. ఒక్కసారి వీడియో రికార్డ్ అయ్యాక.. అప్పటివరకు ఉన్న స్నేహం ముసుగు తీసి అసలు స్వరూపాన్ని చూపిస్తారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని లేదా రేప్ కేసు పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు.


  పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలు విస్తుగొలుపుతున్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు గతంలో మార్బుల్ మరియు ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసేవారు. అందులో భారీగా నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆ అప్పుల నుంచి త్వరగా బయటపడేందుకు షార్ట్ కట్ మార్గాల కోసం యూట్యూబ్‌లో వెతికారు. హనీట్రాప్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని గ్రహించి.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ నేరానికి పూనుకున్నారు. నిందితురాలు డింపుల్ పేరుతో సోషల్ మీడియా ఖాతాలు తెరిచి బాధితులకు గాలం వేసేది.


వీరి ఆగడాలు ఎంతలా సాగాయంటే.. వారు నివసిస్తున్న రూ. 45 లక్షల ఫ్లాట్ వాయిదాలను కూడా బాధితుల చేతే కట్టించుకునేవారు. కేవలం నగదు మాత్రమే కాకుండా బాధితుల నుంచి ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, కారు వంటి ఖరీదైన వస్తువులను కూడా వసూలు చేశారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది పుర ప్రముఖులు, నేతలు వీరికి అడిగినంత ఇచ్చుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే ఒక బాధితుడి నుంచి ఏకంగా రూ. 12 లక్షలు వసూలు చేసిన ఈ దంపతులు, మరో రూ. 5 లక్షలు కావాలని వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ కిలాడీ కపుల్ బాగోతం బట్టబయలైంది.


హనీట్రాప్ తో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేడింగ్ పేరుతో మరో కొత్త పంథా నడుస్తోంది. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు అందమైన ఫోటోలు పంపి స్నేహం చేయడం.. ఆపై ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే లక్షలు వస్తాయని నమ్మించడం ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కోసం డేటింగ్ యాప్స్ లో వెతికే వారు ఇలాంటి ముఠాల చేతికి చిక్కి విలవిల్లాడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa