ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా బాస్ కేసీఆర్ అంటూ ,,,,బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 29, 2026, 08:02 PM

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత ఆయన. గతంలో బీఆర్ఎస్‌లో కీలక పాత్ర పోషించిన ఈటల.. ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో ఈటల మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఎంతో ఆచితూచి మాట్లాడతారని ఈటలకు పేరుంది. అలాంటి ఈటల తాజాగా మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.


తాజాగా ఈటల రాజేందర్ మల్కాజిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కులం, మతం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తనకు పదవి ఇవ్వలేదని.. జనాలే తనను అక్కున చేర్చుకున్నారని.. వారి వల్లే తనకు ఈ పదవి వచ్చిందని తెలిపారు.


తనతో ఉంటే లాభం తప్ప నష్టం ఉండదన్నారు. నియోజకవర్గంలో చేపట్టే పనులన్నింటికీ.. కేంద్రం నుంచి నిధులను మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను అన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి (మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు) బాస్ అదే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల ప్రస్తావించగానే.. సభలో ఒక్కసారిగా జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.


సోషల్ మీడియాలోనైతే ఈటల మళ్లీ బీఆర్ఎస్‌లో చేరతారనే ప్రచారం కూడా మొదలైంది. గతంలో గులాబీ పార్టీలో కీలక నేతగా, మంత్రిగా ఈటల ఓ వెలుగు వెలిగారు. గులాబీ పార్టీకి తామే ఓనర్లమంటూ ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేశారు కూడా. అలాంటిది ఆయన నోట కేసీఆర్ మా బాస్ అనే మాట రావడం చర్చకు దారి తీసింది. ఈటల తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారనే పోస్టులో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న ఈటల.. యథాలాపంగా ఈ మాటలు అన్నారా? లేదంటే భవిష్యత్తుకు సంకేతాలా? అనేది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.


రూ.80 కోట్ల వ్యయంతో..


ఇదిలా ఉంటే మల్కాజిగిరి ప్రాంతవాసులను ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఆర్‌యూబీ, ఎల్‌హెచ్ఎస్‌ల నిర్మాణానికి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. రూ. 80 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నిధులు సమకూరుస్తుంది. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇవి అందుబాటులోకి వస్తే.. రోడ్డు క్రాసింగ్‌ల వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదు, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా తగ్గుతాయి. ఈ పనులు ప్రారంభించడంతో మల్కాజిగిరి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa