ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 08:06 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ.. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్షాలపై అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇక పోలింగ్ దగ్గరపడుతున్న వేళ.. ప్రచార జోరు మరింత పెంచాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు .. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. గతేడాది సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడుకు సంబంధించి.. బాధితులను రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు.


సిగాచి దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం రూ.కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేశారు. ఇస్నాపూర్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిగాచి కంపెనీ బాధితుల గురించి హరీష్ రావు ప్రస్తావించారు. ఆ ఘోర ప్రమాదంలో ఏకంగా 54 మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పటివరకు వారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.


ఆ ఘటనలో సిగాచీ కంపెనీ మాత్రమే.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల పరిహారం ఇచ్చినట్లు హరీష్ రావు వెల్లడించారు. హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డివి ఉత్త మాటలు మాత్రమేనని.. చేతలు మాత్రం శూన్యమని హేళన చేశారు. మరోవైపు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పేదల వ్యతిరేక పార్టీ అని హరీష్ మండిపడ్డారు. 2 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది కేవలం కేసీఆర్ మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


గతేడాది జూన్ 30వ తేదీన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించగా.. సుమారు 54 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. అయితే ప్రమాదం రియాక్టర్ పేలుడు వల్ల కాదని.. అగ్ని ప్రమాదం అని సిగాచి కంపెనీ వెల్లడించింది. ఈ ఘటన తర్వాత 90 రోజుల పాటు ఆ ప్లాంటులో పనులు నిలిపివేశారు. ఈ ప్రమాద ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్.. ఐదుగురు సభ్యుల కమిటీతో దర్యాప్తుకు ఆదేశించింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa