తెలంగాణలో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం సుప్రీంకోర్టు లో మరోసారి విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గత విచారణలోనే సుప్రీంకోర్టు.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఆదేశాలు జారీ చేయగా.. దానిపై ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ మార్పుకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను.. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టుకు వివరించారు.
ఇక ఈ వ్యవహారంలో వాదనలు విన్న జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్.. ఇప్పటికే విచారణ చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు పార్టీ మారినట్లు పేర్కొన్న 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి సంబంధించి స్పీకర్ క్లీన్చీట్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం పడుతుందని అందుకే మార్చి నెల మధ్య నాటికి సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
అయితే మరోసారి గడువు ఇవ్వాలని కోరడం పట్ల.. బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ మోహిత్రావు.. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలోనే స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ జరపడానికి ఇంకా ఏమీ లేదని పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినట్లు తెలిపారు. మొదట 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పేరుతో మరోసారి సాకులు వెతుకుతున్నారని కోర్టుకు తెలిపారు.
మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తె కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఎమ్మెల్యేలు అందరూ తాము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని.. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతున్నారని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం.. ఈ కేసు తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆ గడువులోగా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే.. దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం మూడు వారాల సమయం మాత్రమే ఇస్తూ విచారణను వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మూడు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. స్పీకర్ పాటించని పక్షంలో అప్పుడే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa