రహదారి విస్తరణ, కొత్త ప్రాజెక్టులు, నూతన పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ అనివార్యం. పరిశ్రమల ఏర్పాటుకు, రోడ్ల విస్తరణకు భూములు తీసుకున్నప్పుడు ఇచ్చే పరిహారం మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా.. అనతి కాలంలోనే ఆ ప్రాంతంలో భూముల విలువ మరింతగా పెరుగుతుంది. దీంతో రెండు విధాలా నష్టపోతామనేది నిర్వాసితుల భయం. అందుకే తమ భూమిని ఇచ్చేది లేదంటూ.. రైతులు ఆందోళనలు చేస్తుంటారు. కొందరైతే భూసేకరణను అడ్డుకోవడానికి కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి భూసేకరణ కష్టంగా మారడంతోపాటు అభివృద్ధి సైతం కుంటుపడుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ సర్కార్ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానంలో ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన భూమి కంటే ఎక్కువ మొత్తంలో భూమిని తీసుకుంటుంది. కొంత భూమిని ఉద్దేశించిన అవసరాలకు వాడుకొని, మిగతా ల్యాండ్ను డెవలప్ చేసి భూమిని ఇచ్చిన రైతులకు తిరిగి ఇచ్చేయనుంది. దీని వల్ల ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారికి అభివృద్ధి ఫలాలు దక్కుతాయి. గతంలో కోల్పోయిన భూమి కంటే.. ప్రభుత్వం ఇచ్చే ల్యాండ్ చిన్నదే అయినప్పటికీ, విలువ పరంగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి భూమిని ఇవ్వడానికి రైతులు ధైర్యంగా ముందుకొస్తారు.
ఉదాహరణకు రోడ్డు నిర్మాణంలో ఓ రైతు రెండెకరాల పొలాన్ని కోల్పోయాడనుకుంటే.. ప్రభుత్వం అతడికి ఆ ప్రాంతంలోనే డెవలప్ చేసిన స్థలం ఇస్తుంది. రైతు రెండు ఎకరాలు ఇస్తే.. ప్రభుత్వం ఇచ్చే భూమి అందులో 40-50 శాతం వరకు ఉంటుంది. అయితే ఇది డెవలప్ చేసిన భూమి కావడంతో మంచి ధర లభిస్తుంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల దగ్గర్నుంచి భూమిని తీసుకోవడం కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరించింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు డెవలప్ చేసిన కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా వారికి ఏటా కౌలు కూడా చెల్లిస్తోంది.
పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానంలోనే భూములను తీసుకుంటున్నాయి. అక్కడి ప్రజలు భూములు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. ఈ రాష్ట్రాల్లో ల్యాండ్ పూలింగ్ అమలు చేస్తున్న తీరును పరిశీలించి.. మన అవసరాలకు తగ్గట్టు ఏమైనా మార్పులు చేయడంతోపాటు.. ప్రజలకు మరింత మేలు చేసేలా తెలంగాణలో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ డ్రాఫ్ట్ను రూపొందిస్తున్నారు.
తెలంగాణలోనూ గత ప్రభుత్వం 2017లోనే ఈ తరహా ప్రయత్నాలు చేసింది. తెలంగాణ భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. జీవో నంబర్ 121 ద్వారా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఉప్పల్ భగాయత్, ప్రతాప సింగారం లాంటి హెచ్ఎండీఏ ప్రాంతాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములను డెవలప్ చేశారు. అయితే నిబంధనల కారణంగా ఈ పథకం ఆదరణ పొందలేకపోయింది.
ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ ముసాయిదాకు సంబంధించిన నిబంధనల రూపకల్పన కోసం హెచ్ఎండీఏ ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ముందుగా హెచ్ఎండీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు పరిచి.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa