తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల నుంచి పెద్దపులులు జనావాసాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తెలంగాణలో పెద్ద పులి కలవరపెడుతోంది. జనగామ, సిద్దిపేట జిల్లాల పరిధిలో పులి సంచారం గుర్తించారు. నర్మేట మండలం అమ్మాపూర్ గ్రామంలో పెద్దపులి పశువులపై దాడి చేసింది. రెండు ఆవు దూడలను చంపినట్లు గ్రామస్థులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు పులి సంచారంపై రైతులు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది దాని పాదముద్రల ఆధారంగా జాడ కోసం అన్వేషిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోకి పులి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
సిద్దిపేట జిల్లని దూల్మిట్ట మండలం కూటిగల్, భైరన్పల్లి, మద్దూర్ మండలం లధ్నూర్, అమ్మాపూర్లో లేగ దూడలపై దాడిచేయడంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ పులి సంచరించినట్లు చెబుతున్నారు. దూల్మిట్ట, నర్మేట, మద్దూర్ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళ ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజుల పాటు కంటిమీద కునులేకుండా చేసిన పెద్ద పులి.. ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. దీంతో అధికారులు, జనం ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ వర్గాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా సుమారు 250 కీ.మీ. ప్రయాణించింది. దట్టమైన అడవులు తారసపడకపోవడం వల్ల ఎక్కడ ఆవాసం ఉండాలో తెలియని పరిస్థితుల్లో అటూఇటూ తిరుగుతోంది. గడచిన 50 ఏళ్లలో జనగామ, యాదాద్రి జిల్లాల్లో పెద్దపులి జాడ కనిపించలేదని అటవీ అధికారులు అంటున్నారు. కానీ, ఇటీవల కొద్ది రోజులుగా కొలనుపాక, లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట పరిసరాల్లో పశువులపై దాడులు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa