తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నెలకొంది. పురపోరులో సత్తాచాటేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ప్రచారం మొదలెట్టేశారు. ప్రచార పర్వం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు పోలింగ్ తేదీ అయిన ఫిబ్రవరి 11 సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఆఖరి అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో మద్యం, మాంసం, నగదుతో ఓటర్లను ఎరవేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఊరిలో మద్యం పంచడం లేదంటూ ఓ యువకుడు చేయి కోసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఓ వార్డుకు చెందిన జాకీర్ అనే యువకుడు.. తమ వార్డులో మందు పంచడం లేదని చేయి కోసుకున్నాడు. పక్క వార్డులో మద్యం పంచుతున్నారు.. మీరు కనీసం క్వార్టర్ కూడా ఇవ్వడం లేదంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఈ పని చేయడం విస్తుపోయేలా చేస్తోంది. తనకు డబ్బులే ముఖ్యమంటూ జాకీర్ మాట్లాడటంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఎంత మద్యానికి అలవాటు పడితే మాత్రం.. ఎన్నికల్లో మందు పంచలేదని ప్రాణాలు తీసుకుంటారా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పని మరొకటి ఉండదంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఓటర్లను పార్టీలు ఎంతలా దిగజార్చాయో ఇది చూస్తే తెలుస్తుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు తెలంగాణలోని 32 జిల్లాలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్ల పరిధిలోని 414 డివిజన్లకు.. అలాగే 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa