తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమ సర్వశక్తులూ ఒడ్డాయి. గత కొద్దిరోజులుగా అభ్యర్థుల తరఫున నాయకులు నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభలతో గల్లీ గల్లీలోనూ ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఇచ్చిన హామీలు, చేసిన విమర్శలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా సెగలు గక్కుతోంది.
అధికార పీఠాన్ని దక్కించుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచార పగ్గాలు చేపట్టగా, ప్రభుత్వ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్తూ హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు అహర్నిశలు శ్రమించారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోయాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, హరీశ్ రావు వంటి కీలక నేతలు రంగంలోకి దిగి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తూ తమ క్యాడర్లో జోష్ నింపారు. అటు భారతీయ జనతా పార్టీ సైతం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ఎంపీలను రంగంలోకి దించి మున్సిపల్ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు దాదాపు 52.43 లక్షల మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఎల్లుండి జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనుండగా, అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 13న వెలువడే ఫలితాలతో తేలనుంది. గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa