నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు అఖండ మెజారిటీని కట్టబెట్టిన నల్గొండ ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, నల్గొండ పట్టణాన్ని హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనకు ఈ గెలుపు నిదర్శనమని అన్నారు. నల్గొండలో మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ కు 27, బీఆర్ఎస్ కు 9, బీజేపీకి 4, ఇతరులకు 8 స్థానాలు దక్కాయి.ఈ విజయం ద్వారా నల్గొండ అంటే కాంగ్రెస్ నల్గొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. గెలుపొందిన కార్పొరేటర్లు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అదే సమయంలో, ఓటమి పాలైన అభ్యర్థులు నిరుత్సాహపడకుండా తమ డివిజన్లలోని సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ఎజెండా అని స్పష్టం చేశారు.నల్గొండ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇకపై వారానికి రెండు రోజులు తాను నల్గొండలోనే అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. నల్గొండలో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రజలకు ఆయన మరోసారి ధన్యవాదాలు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa