మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లోనైనా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే, సదరు పురపాలిక పరిధిలో ఓటరుగా నమోదు కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది.ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నారో, అక్కడ వారి పేరు ఓటరు జాబితాలో ఉండాలి. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే, వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగడానికి అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా వేసే ఓట్లు ఏవైనా ఉంటే అవి చెల్లవని ఎస్ఈసీ స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 ప్రకారం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన చోట ఈ ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. తాజా ఎస్ఈసీ (SEC) నిబంధనలతో, స్థానిక ఓటు లేని ప్రజాప్రతినిధులు తమ ఓటును వినియోగించుకోలేరు. దీంతో అనేక చోట్ల మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa