హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు సహా పలువురు కౌన్సిలర్లతో కలిసి భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన బండి సంజయ్.. అమ్మవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు.
పంజాబ్లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లాగే.. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి పూర్వవైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీ ఇచ్చారు. హిందూ సమాజానికి రక్షణ కవచంగా ప్రస్తుతం ఈ భాగ్యలక్ష్మీ ఆలయం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. తాను గతంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచే మొదలై సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. 2021 ఆగస్టు 28వ తేదీన ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాగా.. ఆ యాత్రకు నేటితో సరిగ్గా 1640 రోజులు పూర్తి కావడం ఒక అద్భుతమని.. అలాంటి రోజున మళ్లీ అమ్మవారిని దర్శించుకున్నట్లు వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం సహా సంతోష్ నగర్, శంషాబాద్లలో ఉన్న ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేశారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మెజారిటీ ప్రజలు తమ ఆస్తులు, ప్రాణాలు కాపాడుకునేందుకు బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బండి సంజయ్.. ఆరు గ్యారంటీల అమలుపై నిలదీశారు. 18 మంత్రివర్గ సమావేశాల్లో రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలపై ఒక్కసారి కూడా చర్చ జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి మూటలు మోసే బిజీలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిల మాటే సీఎం రేవంత్ రెడ్డి ఎత్తడం లేదని ఆరోపించారు. ఉద్యోగుల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తోందని మండిపడ్డారు. బతికి ఉన్న వారికి ప్రయోజనాలు కల్పించకుండా.. చనిపోయిన తర్వాత బీమా ఇస్తామనడం ఏంటని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం.. ఒక ఆరంభం మాత్రమేనని.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ జెండా రెపరెపలాడుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం అరాచకాలను అడ్డుకునే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. భాగ్యనగర్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా హిందూ సమాజం మేల్కోవాలని.. ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బాన్సువాడలో బీజేపీ నేతలపై జరుగుతున్న అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa