ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు అలిపిరి బ్లాస్ట్‌లో కీలక నేత,,,,,మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 06:20 PM

దేశంలో మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో.. ఆపరేషన్‌ కగార్‌తో అడవుల్లో అలజడి నెలకొంది. ఒకవైపు.. గత కొన్ని నెలలుగా భారీగా ఎన్‌కౌంటర్లు, కూంబింగ్ ఆపరేషన్లతో కేంద్ర బలగాలు అడవుల్లో వేట సాగిస్తుండగా భారీ ఎత్తున మావోయిస్టులు, అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. మరోవైపు.. చాలా మంది దళ నాయకులు, తమ టీంతో సహా పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మావోయిస్ట్ రహిత దేశంగా భారత్‌ను మార్చుతామని కేంద్రం వెల్లడిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ.. మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. దేవ్‌జీతోపాటు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటించారు.


గత 2 ఏళ్లలో 26 మంది డివిజన్‌ కమిటీ సభ్యులు, 16 మంది ఎస్‌ఈఎంలు, నలుగురు సీసీఎంలు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్‌లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు సహా మొత్తంగా 591 మంది నక్సలైట్లు వనం వీడి జనంలోకి వచ్చినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. అందులో కొందరు తమతో చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే వారు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తారని తెలిపారు.


కొన్ని రోజుల క్రితమే మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌వాంటెడ్‌ హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో చాలా మంది మావోయిస్ట్ అగ్రనేతలు మరణించారు. మరికొందరు సీనియర్లు స్వచ్ఛందంగా ఆయుధాలు వీడి జనంలో కలుస్తున్నారు. సాధారణ వ్యక్తిగా ఉద్యమంలో చేరి పార్టీ దళపతిగా ఎదిగిన దేవ్‌జీ.. ఇప్పుడు లొంగిపోవడం మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.


తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి ఇంటర్‌ వరకు చదివాడు. ఆ తర్వాత 1980లో అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరాడు. జగిత్యాల జైత్రయాత్రతో ఉత్తర తెలంగాణలో భారీ ఎత్తున ఎగసిన ఉద్యమ ప్రభావంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తిప్పిరి తిరుపతి.. 1983లో డిగ్రీని మధ్యలోనే వదిలేసి రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ) భావజాలానికి ఆకర్షితుడై ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. తెలుగుతోపాటు హిందీ, గోండి భాషలు వచ్చిన తిప్పిరి తిరుపతికి అనేక పేర్లు ఉండేవి. దేవ్‌జీ, సుదర్శన్, సంజీవ్, కుమ్ముదాదా అనే మారు పేర్లతో తిప్పిరి తిరుపతి సంచరించేవాడు.


 మహారాష్ట్ర గడ్చిరోలిలో దళ సభ్యుడిగా చేరిన తిప్పిరి తిరుపతి.. ఆ తర్వాత ఏరియా, డివిజినల్‌ కమాండర్‌గా ఎన్నికయ్యాడు. 2001లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్‌ కమిటీ.. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు ఇంఛార్జ్‌గా తిప్పిరి తిరుపతి నియమితులు అయ్యాడు. ఈ క్రమంలోనే సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో(సీఆర్‌బీ)కు మార్గదర్శకత్వం వహించడంతోపాటు.. పొలిట్‌ బ్యూరోలో సభ్యుడిగానూ ఉన్నాడు.


2003లో తిరుపతిలోని అలిపిరి వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జరిగిన బాంబు దాడి ఘటనలో దేవ్‌జీ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక 2010లో ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడలో 74 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను చంపేసిన ఘటనలోనూ దేవ్‌జీ కీలకంగా పనిచేశాడు. ఎన్‌ఐఏ మోస్ట్‌వాంటెడ్‌గా ప్రకటించిన దేవ్‌జీపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌తోపాటు రూ.కోటి రివార్డు ఉంది.


గత సంవత్సరం మే నెలలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ ఛత్తీస్‌గఢ్‌లోని గుండెకోట్‌ ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. దీంతో మావోయిస్ట్ పార్టీకి నాయకత్వ లోపం ఏర్పడింది. ఈ క్రమంలోనే పార్టీ కొత్త అధిపతిగా తిప్పిరి తిరుపతిని నియమించారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు భారీగా కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. ముప్పేట దాడుల నుంచి తప్పించుకునేందుకు వీరంతా ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో తలదాచుకున్నట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa