ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాదిలో అందుబాటులోకి తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 06:19 PM

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటే పౌరులకు సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించారు. వరంగల్ మామునూరు, రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయి.


ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు డీపీఆర్‌ సిద్ధంగా కాగా.. అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొద్ది రోజుల్లోనే డీపీఆర్‌కు ఆమోదం లభించే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై ఏడాదిలో పనులు పూర్తి చేసి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా వంటి పెద్ద పెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేను మూడు కి.మీ.మేర పొడిగిస్తారు. ప్రయాణికుల టెర్మినల్, కార్గో సౌకర్యం, సెక్యూరిటీ వ్యవస్థలు, పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఎయిర్‌పోర్టులో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు.


మామునూరు ఎయిర్‌పోర్ట్‌ ప్రస్తుతం చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా ఉంది. దీన్ని పూర్తిస్థాయి కమర్షియల్‌ ఎయిర్‌పోర్ట్‌గా మార్చడంతో వరంగల్‌ ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్లనుందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్‌ నగరం వెళ్లాల్సిన లేకుండా ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చునని అంటున్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వరంగల్‌ నగరానికి క్యూ కడతాయని చెబుతున్నారు. టూరిజం పెరుగుతుందని.. రామప్ప ఆలయం, వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట వంటి ప్రదేశాలు సందర్శించే విదేశీ పర్యాటకులు పెరుగుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొదట చిన్న, మధ్యస్థాయి విమానాలతో రాకపోకలు ప్రారంభిస్తారని.. ఆ తర్వాత రోజుకు 1-2 విమానాలు రాకపోకలు సాగిస్తాయని అంటున్నారు. ప్రధానం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa