తెలంగాణ రాష్ట్రంలో వేసవి కాలం ముందే వచ్చేసినట్లు కనిపిస్తోంది. మార్చి మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీల మార్కును దాటేశాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వాతావరణ నిపుణుల లెక్కల ప్రకారం ఈ ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అసాధారణ మార్పుతో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుంది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వేడి గాలుల ప్రభావం రాత్రి సమయాల్లో కూడా స్వల్పంగా కనిపిస్తుందని, పసిపిల్లలు మరియు వృద్ధులు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురును కూడా అందించింది. మార్చి 16వ తేదీ తర్వాత రాష్ట్రంలోని పలు చోట్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వర్షాల వల్ల పెరిగిన ఉష్ణోగ్రతల నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించవచ్చని భావిస్తున్నారు. ఎండల తీవ్రత మధ్య కురిసే ఈ వానలు వాతావరణాన్ని కాస్త చల్లబరుస్తాయని ఆశిద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa