భారతదేశం ఇప్పుడు ఎంతమాత్రం వెనుకబడిన దేశం కాదు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది. అనేక రంగాల్లో భారత్ సాధించిన వృద్ధి దేశ ఆర్థిక బలోపేతానికి దోహదపడుతోంది. అనేక దేశీయ కంపెనీలు అంతర్జాతీయంగా సత్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి. ఈ భారత ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల్లో తన వాహనాలను విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో మహీంద్రా విద్యుత్ ఆధారిత వాహనాలను విదేశీ ప్రతినిధులు ఆసక్తిగా తిలకిస్తుండడం ఆ ఫొటోల్లో చూడొచ్చు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. "దశాబ్దాల కిందట వాహన రంగంలో నా కెరీర్ ను ఆరంభించినప్పుడు ఇంటర్నేషనల్ ఆటో ఎక్స్ పో కోసం భారత ప్రతినిధి బృందంలో భాగంగా విదేశాలకు తరలివెళ్లాం. ఆ వాహన ప్రదర్శనలో ఆధునికమైన కార్లను ఫొటోలు తీసుకుని, ఆ కార్ల గురించి అధ్యయనం చేశాం. ఇటీవల ఢిల్లీలో భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్ పో షో నిర్వహించారు. ఈ ఎక్స్ పోలో మా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కార్లను చూసేందుకు జపాన్, కొరియా దేశాలకు చెందిన విజిటర్లు పోటీలు పడ్డారు. ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు నాలో పొంగిన భావోద్వేగాల గురించి ఏం చెప్పమంటారు? నేనెంత పొంగిపోయానో మీరు ఊహించుకోవచ్చు" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.