ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్,,,భారత్ భారీ విజయం

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 10:45 PM

ఇంగ్లాండ్‌తో 3 వన్డేల సిరీస్‌ను భారత్‌ క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత జయభేరీ మోగించింది. ఇప్పటికే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 356 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 214 పరుగులకు కుప్పకూల్చింది. కాగా వన్డే సిరీస్‌కు ముందు భారత్.. టీ20 సిరీస్‌ను సైతం 4-1తో కైవసం చేసుకుంది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్.. తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సిరీస్‌లో తొలిసారి ఫస్టు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ముఖ్యంగా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్‌ (78), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (40) కూడా రాణించారు. దీంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లు, మార్క్‌వుడ్ 2, సాకిబ్ మహమూద్‌, గస్‌ అట్కిన్సన్, జో రూట్‌లు తలా ఒక వికెట్ తీశారు.


అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓ దశలో 6.1 ఓవర్లలో 60/0తో నిలిచింది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ బెన్ డకెట్‌ (34)ను ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ సింగ్ వికెట్ల వేటను ప్రారంభించాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరకు 34.2 ఓవర్లలో ఇంగ్లాండ్.. 214 పరుగులకు ఆలౌట్ అయింది. 142 పరుగుల తేడాతో భారత్ జయభేరీ మోగించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను శుభ్ మన్ గిల్ కైవసం చేసుకున్నాడు.


భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్‌ పటేల్, హార్దిక్ పాండ్యాలు రెండేసి వికెట్ల చొప్పున తీశారు. వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక ఈ ఫలితంతో వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌ను కూడా భారత్ 4-1తో గెలుపొందింది. ఈ పర్యటనలో మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్.. కేవలం ఒకే టీ20లో గెలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com