ఇండియా క్రికెట్ టీమ్ కాలం కలిసొస్తోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో తొలిసారి ఫస్టు బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్.. తొలుత భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ సిరీస్లో తొలి రెండు వన్డేల్లో ఛేజింగ్ చేసి విజయం సాధించిన భారత్.. ఈసారి మాత్రం ఫస్టు బ్యాటింగ్కు దిగింది. అయితే, గత మ్యాచ్లో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈసారి మాత్రం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాట్ ఝుళిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
రోహిత్ ఔటైన తర్వాత శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. గత కొన్ని రోజులుగా పరుగులు చేసేందుకు ఇబ్బండి పడుతున్న విరాట్.. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ (52)తో టచ్లోకి వచ్చాడు. ఇక ఈ సిరీస్లో తొలి రెండు వన్డేల్లో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న శుభ్మన్ గిల్ (తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 రన్స్) తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ మైదానంలో మాత్రం మూడంకెల మార్కును చేరుకున్నాడు. 95 బంతుల్లో శతకం సాధించాడు.
శ్రేయస్ అయ్యర్ (78) కూడా మరోసారి రాణించాడు. ఇక ఈ సిరీస్లో వరుసగా రెండు వన్డేల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి విఫలమైన కేఎల్ రాహుల్.. మళ్లీ తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 40 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా (17), అక్షర్ పటేల్ (13), వాషింగ్టన్ సుందర్ (14), హర్షిత్ రాణా (13) కూడా పరుగులు రాబట్టడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సరిగ్గా 50 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మార్క్వుడ్ 2, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు. మరోవైపు మూడు వన్డేల సిరీస్లో భారత్ ఇదివరకే 2-0తో నిలిచింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి.. క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
![]() |
![]() |