ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి సాయంతో భర్తను చంపింది.. శరీరాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో దాచి సిమెంట్‌తో సీల్ చేసింది

Crime |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:29 PM

ఓ నేవీ ఆఫీసర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెకు పాప కూడా పుట్టింది. కానీ ఆ తర్వాతే మరో వ్యక్తికి దగ్గరైంది. అతడితోనే జీవితం పంచుకోవాలనుకున్న ఆమె.. ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది. ఆపై మృతదేహాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టింది. వాసన రాకుండా, ఎవరికీ తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో సిమెంట్ వేసి సీల్ చేసేసింది. ఇదంతా బయటకు రాకూడదని భర్త ఫోన్ తీసుకుని విహార యాత్రకు వెళ్లింది. దాని వల్లే చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతోంది. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ ఓ మర్చెంట్ నేవీ ఆఫీసర్. 2016లో ఇతడు తాను ప్రాణంగా ప్రేమించిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతోనే ఎక్కువ సమయం గడపాలనుకుని నేవీ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి. అది భరించలేకపోయిన సౌరభ్ రాజ్‌పుత్ తన భార్యను తీసుకుని అద్దె ఇంటికి వెళ్లిపోయాడు. భార్యను చాలా ప్రేమగా చూసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా 2019లో ఓ పాప కూడా పుట్టింది.


ఇదంతా బాగానే ఉండగా.. ముస్కాన్‌కు మాత్రం తన భర్త స్నేహితుడు సాహిల్ పరిచయం అయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. చాటుమాటుగా వీరిద్దరూ ఫోన్లు మాట్లాడుకోవడం, కలుసుకోవడం వంటివి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సౌరభ్ భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ తమ వల్ల కుమార్తె జీవితం నాశనం అవ్వడం ఇష్టం లేక భార్యతోనే కలిసి ఉంటున్నాడు. అయితే కుమార్తెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే నిర్ణయంతో 2023లో మళ్లీ నేవీ ఉద్యోగంలో చేరాడు. ఈక్రమంలోనే వేరే దేశానికి వెళ్లి అక్కడే పని చేస్తున్నాడు.


భర్త లేకపోవడంతో.. ముస్కాన్ తన ఇంట్లోనే ప్రియుడితో కలవడం ప్రారంభించింది. శారీరకంగా కూడా వీళ్లు బాగా దగ్గర కాగా.. జీవితాంతం అలాగే కలిసుండాలని అనుకున్నారు. అడ్డుగా ఉన్న సౌరభ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన కుమార్తె 6వ పుట్టిన రోజు ఉండగా.. విదేశాల్లో ఉన్న సౌరభ్ 24వ తేదీనే ఇంటికి వచ్చాడు. పుట్టిన రోజును ఘనంగా జరిపాడు. మరోవైపు ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ సౌరభ్‌ను చంపేందుకు ఓ ప్లాన్ కూడా వేశారు. ఈక్రమంలోనే ముస్కాన్ తన భర్తకు నిద్ర మాత్రలు కలిపిన పాలు ఇచ్చింది. స్పృహ తప్పాకా ప్రియుడితో కలిసి అతడిని చంపేసింది.


ఆపై మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి వాటిని ఓ డ్రమ్ములో వేశారు. వాసన రాకుండా, కనిపించుకండా ఉండాలని.. దాన్ని సిమెంట్ తో కప్పేశారు. కానీ పక్కింటి వాళ్లు, సౌరభ్ స్నేహితులు.. అతడి గురించి ఆరా తీయగా.. మనాలీ వెళ్లాడని చెప్పింది. భర్త ఫోన్ తీసుకుని ప్రియుడితో కలిసే ఆమెనే మనాలి వెళ్లింది. అక్కడే భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్ చేసింది. కానీ ఎవరు ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఇంటి వద్ద ఆమె లేకపోవడంతో.. కుటుంబ సభ్యులు, సౌరభ్ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా అతడి భార్య ముస్కాన్‌కు ఫోన్ చేసి రమ్మనగా.. ఇంటికి చేరుకుంది. ఈక్రమంలోనే పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా... నేరం ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి తానే భర్తను చంపినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై సౌరభ్ మృతదేహాన్ని సీల్ చేసిన డ్రమ్మును స్వాధీనం చేసుకుని.. మార్చురీకి తరలించారు. అప్పటికే సిమెంట్ గట్టిపడగా.. రంపంతో కోసి మరీ మృతదేహం భాగాలను వెలికితీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com