ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. ఓయో రూంలో బాలికలు

Crime |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:40 PM

సోషల్ మీడియాలో పరిచయాలు చాలా దూరం తీసుకెళ్తున్నాయి. వీటిని మంచికి ఉపయోగించుకునే వారు కొంత మంది ఉంటే.. చెడుకు వాడుకొని తమ జీవితాలను నాశనం చేసుకునే వారు మరికొంత మంది ఉన్నారు. వాటిలో ముఖ్యంగా మైనర్ బాలికలు, బాలురే ఎక్కువగా ఉన్నారు. తెలియని వ్యక్తులను ఇన్‌స్టాలో పరిచయం చేసుకోవడం.. కొన్ని రోజుల పాటు ఇలానే చాటింగ్‌లు చేసుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది.


దీనిలో భాగంగానే.. ప్రేమపేరుతో కొంతమంది మయమాటలు చెప్పి.. యువతులను లోబరచుకొని.. మోసం చేస్తున్న ఘటనలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని అల్వాల్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పిన యువకులు.. లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కర్నాటి మెహన్చంద్, దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన ఆకుల సాత్విక్ ఇద్దరు స్నేహితులు. వీరు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే ఓ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మచ్చబొల్లారానికి చెందిన ఇద్దరు బాలికలు పరిచయం అయ్యారు. వీరిద్దరు కూడా 9వ తరగతి వరకు చదువుకొని మధ్యలోనే చదువు ఆపేశారు.


వారితో పరిచయం పెంచుకున్న ఆ యువకులు ఐదు నెలల పాటు చాటింగ్‌లు చేస్తూ.. ఫోన్లలో మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పేవారు. వారి మాటలను నమ్మిన ఆ ఇద్దరు బాలికలు బుధవారం ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. అయితే రాత్రి వరకు కూడా వాళ్లు ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించారు. చివరకు వారు ఈసీఐఎల్‌లోని ఓయో లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు.


అక్కడ ఆ యువకులు వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణకు రావడంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికలు మైనర్లు కావడంతో వారిపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిబంధనలకు విరుద్దంగా అనుమతి ఇచ్చిన ఓయో లాడ్జీ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని.. పరిచయం లేని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com