హైదరాబాద్ దోమలగూడ పరిధిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును మంటల్లో కాల్చి సజీవ దహనం చేసిన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల క్రితం.. ఇందిరా పార్క్ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో చెత్త తరలించే వాహనాల పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును సజీవ దహనం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. తాజాగా.. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నార. ఓ 17 ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ అయ్యేలా మాత్రలు ఇచ్చి పుట్టిన బిడ్డను కాల్చేసినట్లు విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు చదవు మధ్యలోనే ఆపేశాడు. సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత బాలికకు దగ్గరై ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక బాలుడికి చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన బాలుడు.. కొన్ని మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడు. మాత్రలు వేసుకున్న తర్వాత బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో అప్పటికే ఏడు నెలల గర్భిణి అయిన బాలిక ఇంట్లోనే మృత శిశువును ప్రసవించింది. ఈ విషయాన్ని బాలుడికి ఫోన్ చేసి చెప్పగా.. పిండాన్ని చెత్తలో పడేసి తగలబెట్టమని సలహా ఇచ్చాడు. బాలుడి సలహా మేరకు బాలిక పిండాన్ని పాలిథిన్ కవర్లో తీసుకెళ్లి ఎన్టీఆర్ స్డేడియం దగ్గర చెత్తలో పడేసి తగలబెట్టింది.
ఆ తర్వాత మార్చి 17న దోమలగూడ పోలీసులకు సమాచారం అందగా.. వారు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల ద్వారా 16 ఏళ్ల బాలికను గుర్తించారు. ఆమె చనిపోయిన బిడ్డను చెత్త కుప్పలో పడేసి తగలబెట్టిందని పోలీసులు కనుగొన్నారు. బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నల్గొండలోని బాలుడి ఇంటికి వెళ్లారు. అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిపై రేప్, మోసం, పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు. బాలుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించారు. బాలికను కౌన్సిలింగ్ కోసం పంపారు. మృత పిండం నుండి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు.
![]() |
![]() |