ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తన జట్టులోని ఓ బౌలర్ పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే మాక్స్ వెల్ వేసిన ఓ బంతిని షాట్ ఆడేందుకు ట్రావిస్ హెడ్ విఫలయత్నం చేశాడు. బ్యాట్ పక్క నుంచి వెళ్లిన బంతి నేరుగా కీపర్ చేతుల్లో పడింది. దీంతో మాక్స్ వెల్ క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. అయితే, అంపైర్ మాత్రం దానిని వైడ్ ఇచ్చారు. దీంతో క్షణం కూడా ఆలోచించకుండా మాక్స్ వెల్ డీఆర్ఎస్ కు అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఆ కాల్ కు ఆమోదం తెలిపి థర్డ్ అంపైర్ రివ్యూ కోరాడు.ఈ క్రమంలోనే మాక్స్ వెల్ తీరుపై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ కు అప్పీల్ చేసే ముందు తనను అడగాల్సిన పనిలేదా అన్నట్లు మాక్స్ వెల్ పై కోపగించుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అయ్యర్ కూడా రివ్యూ కోరుతూ సిగ్నల్ ఇచ్చాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ కోరితేనే డీఆర్ఎస్ కాల్ స్వీకరించాలి. కానీ ఇక్కడ మాక్స్ వెల్ అప్పీల్ చేయగానే వెంటనే థర్డ్ అంపైర్ రివ్యూ కోరడంపై అభిమానులు విమర్శిస్తున్నారు.
![]() |
![]() |