ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీవ్‌లో భారత ఫార్మ కంపెనీ గొడౌన్‌పై,,,రష్యా మిసైల్ దాడి!

national |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 08:08 PM

కీవ్‌లోని ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గొడౌన్‌పై రష్యా క్షిపణితో దాడి చేసినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. తమ దేశంలోని భారతీయ వ్యాపారాలను రష్యా "ఉద్దేశపూర్వకంగా" లక్ష్యంగా చేసుకుందని న్యూఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ‘ఈరోజు (శనివారం) రష్యా క్షిపణి ఉక్రెయిన్‌లోని భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ గొడౌన్‌ను ఢీకొట్టింది. భారత్‌తో 'ప్రత్యేక స్నేహం' అని చెప్పుకుంటూనే, మాస్కో ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటోంది.. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన ఔషధాలను నాశనం చేస్తోంది’ అని కీవ్ రాయబార కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింది.


భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తాకు చెందిన కుసుమ్.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి. ఉక్రెయిన్‌లో ప్రాథమిక ఔషధాలకు ఇది అత్యంత కీలకమైంది. గొడౌన్‌ను నేరుగా డ్రోన్ ఢీకొట్టిందని క్షిపణి కాదని ఆ సంస్థ తెలిపింది.


ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటన వెలువడటానికి ముందు కీవ్‌లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ రష్యా దాడిలో కీలక ఫార్మా గొడౌన్ ధ్వంసమైందని అన్నారు. అయితే, ఇది రష్యన్ డ్రోన్‌లు ఈ దాడి చేశాయని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఉదయం రష్యన్ డ్రోన్‌లు కీవ్‌లోని ఒక ప్రధాన ఫార్మాస్యూటికల్ గొడౌన్‌ను పూర్తిగా నాశనం చేశాయి, వృద్ధులు, పిల్లలకు అవసరమైన ఔషధ నిల్వలను బూడిద చేశాయి. ఉక్రెయిన్ పౌరులపై రష్యా భయానక విధ్వంసం కొనసాగుతోంది’ అని మార్టిన్ Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను ఆయన షేర్ చేశారు. అందులో గొడౌన్‌లా కనిపించే నిర్మాణం నుంచి పొగలు ఎగసిపడుతున్నాయి.


ఉక్రెయిన్‌లో నరేంద్ర మోదీ.. జెలెన్‌స్కీ భుజం మీద చేయి వేసి మరీ భరోసా!


మరోవైపు, ఉక్రెయిన్ తమపై మౌలిక సదుపాయాలపై దాడిచేసిందని రష్యా ప్రకటించడం గమనార్హం. ఇది అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన నిషేధ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఉక్రెయిన్, రష్యా గత నెలలో ఒకరి ఎనర్జీ మౌలిక సౌకర్యాలపై ఒకరిపై మరొకరు దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయి, అయితే ఇరు దేశాలు పదేపదే నిషేధాన్ని ఉల్లంఘించాయని ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు.


ఇక, ఉక్రెయిన్, రష్యా సంఘర్షణలో తటస్థంగా వ్యవహరిస్తోన్న భారత్..యుద్ధాన్ని ముగించాలని కోరుతోంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత రష్యా నుంచి పెద్ద మొత్తంలో భారత్ చమురును కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, కొన్ని ఐరోపా దేశాలు కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల రష్యా చమురు ధరలు గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణం. రష్యా ఇప్పటికీ భారత్‌కు ముఖ్య చమురు సరఫరాదారుగా ఉంది. భారత్ ఫిబ్రవరిలో రష్యా నుంచి రోజుకు 1.48 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది, ఇది అంతకు ముందు నెలలో 1.67 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com