ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆప్ నేతల మెడకు మరో కేసు.. ఈ సారి ఏకంగా 2 వేల కోట్ల రూపాయల స్కామ్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 10:24 PM

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు మరో అవినీతి కేసులో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా 2 వేల కోట్ల రూపాయల స్కామ్‌లో ఇరుకున్నారు. ఢిల్లీలో గతంలో ఆప్ పాలనలో చేపట్టిన పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీవ్ర ఆరోపణలు చేసింది. మొత్తం 12 వేల స్కూళ్లు, తరగతి గదుల నిర్మాణం చేపట్టిన ప్రక్రియలో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో దీనికి బాధ్యులను చేస్తూ.. అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి సత్యేందర్ జైన్‌లపై ఏసీబీ అధికారులు.. అధికారికంగా కేసు నమోదు చేశారు.


 అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీశ్ సిసోడియా.. ఆప్‌ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండగా.. సత్యందర్‌ జైన్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి నేతృత్వంలోనే గతంలో ఢిల్లీలో సుమారు 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం ప్రారంభించారు. అయితే ఈ పనుల్లో సుమారు రూ.2వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక ఈ పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణ పనులను.. సుమారు 34 మంది కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఇలా కాంట్రాక్టులు పొందిన వారిలో చాలామందికి ఆప్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు.


ఇక సదరు కాంట్రాక్టర్లు.. తరగతి గదులను 30 సంవత్సరాలకు ఉండేలా కడితే.. వాటికి అయిన ఖర్చు మాత్రం 75ఏళ్లు ఉండేలా అయ్యిందని ఏసీబీ అధికారులు తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేయడానికి విధించిన గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించుకోవడంతో.. ఈ భవనాల నిర్మాణ వ్యయం సుమారు ఐదు రెట్ల వరకు పెరిగిపోయిందని అధికారులు తెలిపారు.


అంతేకాక ఇటీవల సెట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఇచ్చిన నివేదికలో కూడా ఆప్ హయాంలో చేపట్టిన తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని వెల్లడించింది. అంతేకాక కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని సీవీసీ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గత నెల అనగా మార్చి, 2025లో ఆమోదం తెలపడంతో తాజాగా వీరిపై ఢిల్లీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com