ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయపరంపర కొనసాగుతోంది. హోంగ్రౌండ్లో కాకుండా ఇతర మైదానాల్లో ఆడిన మ్యాచ్లలో ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయింది. చేతిలో వికెట్లు ఉన్నా.. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జ్టటు బ్యాటర్లు అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్.. రాయల్స్.. 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ (47 బంతుల్లో 75 రన్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, జోష్ హేజిల్వుడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీలు మెరుపు శుభారంభం ఇచ్చారు. గత మ్యాచ్లో ఆడినట్లే ధాటిగా ఆడి.. బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ ఇదే పిచ్పై బౌండరీల మోత మోగించాడు. 6 సిక్స్లు, 5 ఫోర్లతో 33 బంతుల్లో 65 రన్స్ స్కోరు చేశాడు.
టీ20ల్లో కోహ్లీ వందో హాఫ్ సెంచరీ..
ఫిలిప్ సాల్ట్ ఉన్నంతసేపు నిదానంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత జూలు విదిల్చాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20ల్లో తన వందో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 108 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే..
డేవిడ్ వార్నర్- 108
విరాట్ కోహ్లీ- 100
బాబర్ ఆజమ్- 90
క్రిస్ గేల్- 88
జోస్ బట్లర్- 86
కోహ్లీ రాణించడంతో ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో మళ్లీ మూడో ప్లేసులోకి వెళ్లింది.
![]() |
![]() |