ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింధు జలాలను ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆపలేం

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:07 PM

పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భావిస్తోన్న భారత్.. పాకిస్థాన్‌కు షాకిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి బదులుగా పాకిస్థాన్ సైతం సిమ్లా ఒప్పందం రద్దు సహా పలు నిర్ణయాలు తీసుకుంది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని నిలిపేయడం ఇందులో ప్రధానమైంది. దౌత్యపరమైన చర్యలు తీసుకుంటూనే.. ఇరు దేశాలు సైన్యాన్ని సైతం అప్రమత్తం చేస్తున్నాయి. దాయాదులిద్దరూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.


ఉగ్రదాడి ఘటన విషయంలో భారత ప్రభుత్వం ఎంతో ఆగ్రహంతో ఉన్నప్పటికీ.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా బయటకు రావడమనేది నీటి యుద్ధంగా పాకిస్థాన్ అభివర్ణించింది. సింధు జలాల్లో తమ వాటాను పూర్తిగా వాడుకుంటామని ప్రకటించింది.


ఈ తరుణంలో అసలు సింధు నదీ వ్యవస్థలోని ప్రధాన నదులేవీ..? ఈ నదుల నుంచి నీటిని దిగువన ఉన్న పాకిస్థాన్‌కు వెళ్లనీయకుండా భారత్ ఆపగలదా? అసలు సింధు నదీ వ్యవస్థ పాకిస్థాన్ ఎంత ప్రధానం అనే వివరాలు చూద్దాం..


సింధు జలాల ఒప్పందమేంటి..?


1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం.. సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను ప్రధానంగా విభజించారు. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌ల నీటిపై పూర్తి నియంత్రణ, వాడుకునే హక్కులను భారతదేశానికి కేటాయించారు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ల నీటిని ప్రధానంగా పాకిస్థాన్ వాడుకునేలా కేటాయించారు. అయితే ఈ నదులపై జలవిద్యుత్ ఉత్పత్తి లాంటి కొన్ని పరిమిత, వినియోగం కాని అవసరాలకు నీటిని వాడుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది.


సింధు నది వ్యవస్థ పాక్‌కు ఎందుకు కీలకం?


పాకిస్థాన్ మొత్తం సాగునీటిలో సింధు నదీ వ్యవస్థ పాత్ర ఎంతో కీలకం. పాకిస్థాన్ సాగునీటి అవసరాల్లో 80 శాతానికిపైగా సింధు నదీ వ్యవస్థే తీరుస్తోంది. ఆ దేశ వ్యవసాయ భూముల్లో అత్యధిక భాగం ఈ నీటిపైనే ఆధారపడి ఉంది. పాకిస్థాన్ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా సుమారు 22 శాతానికిపైనే ఉంటుంది. పాక్ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు వ్యవసాయ రంగం చాలా కీలకం. సింధు నదీ జలాల లభ్యతలో ఏ చిన్న తేడా వచ్చినా అది పాకిస్థాన్ వ్యవసాయ రంగంపై, తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.


సింధు జలాలను భారత్ ఆపగలదా..?


ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లు ఆగినట్లు.. సింధు జలాలు పాకిస్థాన్ వెళ్లకుండా ఇప్పటికిప్పుడు భారత్ చేయలేదు. కానీ కావాలనుకుంటే మాత్రం అదే నీటిని అస్త్రంగా వాడి పాకిస్థాన్‌ను వరదలతో ముంచెత్తగలదు లేదంటే నీటి కొరతతో అల్లాడిపోయేలా చేయగలదు. భారత్ ఇప్పటికే చినాబ్ నదిపై బాగిల్‌హర్, దుల్‌హస్తి, సలాల్ డ్యామ్‌లతోపాటు.. జీలం ఉపనది అయిన కృష్ణ గంగపై కృష్ణ గంగ డ్యామ్, లడఖ్‌లో సింధు నదిపై నిమూ బజ్గో డ్యామ్‌లను నిర్మించింది.


ర్యాట్లీ జలవిద్యుత్ కేంద్రం, పాకాల్ దుల్ డ్యామ్, కిరు జలవిద్యుత్ కేంద్రం, క్వార్ జలవిద్యుత్ కేంద్రాలు సైతం నిర్మాణ దశలో లేదా ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటిలో పాకాల్ దుల్ డ్యామ్ చీనాబ్ ఉపనది మరుసుదార్ నదిపై ఉండగా.. మిగతావన్నీ చినాబ్‌ నదిపై నిర్మిస్తున్నారు.


ఇప్పుడు సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు వచ్చేయడం ద్వారా.. భారత్ మరింత దూకుడుగా, గోప్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఈ నీళ్లను ఇతర ప్రాంతాలకు మళ్లించుకునే వీలు ఉంటుంది. అయితే సింధు నదీ వ్యవస్థలో భాగమైన నదులు, ఉపనదుల నుంచి నీటిని దిగువకు వదలకుండా చేయడానికి.. భారత్ కేవలం డ్యామ్‌లను నిర్మిస్తే సరిపోదు. నీటిని మళ్లించడం కోసం భారీ సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. పర్వతాలు, లోయలతోపాటు కఠిన వాతావరణ పరిస్థితులు ఉండే హిమాలయాల్లో సొరంగాలు తవ్వడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. సొరంగాలు తవ్వడానికి పదేళ్లకుపైగా శ్రమించాల్సి రావచ్చు.


భారత్ తలుచుకుంటే..


సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటి వరకూ పాకిస్థాన్‌కు ఈ నదుల్లోని ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని రెగ్యులర్‌గా అందిస్తోంది. ఇక నుంచి నదీ ప్రవాహానికి సంబంధించిన వివరాలను, వరదల హెచ్చరికలను పాకిస్థాన్‌తో పంచుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదు. దీన్ని వల్ల దిగువన ఉన్న పాకిస్థాన్‌ వరదల బారిన పడే ప్రమాదం ఉంది. న్యూఢిల్లీ గనుక ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల నుంచి నీటిని ఒక్కసారిగా కిందకు వదిలితే.. పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తుతాయి.


ఇండస్ ట్రీటీ అమల్లో ఉన్నప్పుడు పాకిస్థాన్ అధికారులు భారత ప్రాజెక్టులను తనిఖీ చేసేవారు. ఇకపై ఆ అవకాశం ఉండదు. ఇండియా రహస్యంగా భారీ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. భారత్ ఇప్పటి వరకూ పాకిస్థాన్ ప్రయోజనాలను దెబ్బతీయకుండా.. సింధు, జీలం, చీనాబ్ నదులపై ప్రాజెక్టులను నిర్మించింది. కానీ ఇక నుంచి నీటిని నిల్వ చేసేలా భారీ ప్రాజెక్టులు, కరువు ప్రాంతాలకు నీటిని మళ్లించేలా కాలువలు నిర్మించుకోవచ్చు.


భారత్ గనుక పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. వర్షాకాలం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడం ద్వారా పాక్‌లో వరదలను సృష్టించడంతోపాటు.. వేసవిలో ప్రాజెక్టు గేట్లను మూసేయడం ద్వారా పాక్‌లో నీటికి కటకట వచ్చేలా చేయొచ్చు.


సింధు జలాల ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకు వచ్చినందుకు గానూ.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలొచ్చే అవకాశం ఉందని భారత్‌కు తెలుసు. అయితే ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడం కోసం వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62ను ఇండియా ఉపయోగించుకోనుంది. ప్రాథమిక పరిస్థితులు మారితే గనుక ఏ ఒప్పందం నుంచైనా బయటకు రావచ్చని వియన్నా ఒప్పందంలోని ఈ ఆర్టికల్ చెబుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తుండటం వల్ల తాము సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు వచ్చామని భారత్ ప్రపంచ దేశాలకు చెప్పే అవకాశం ఉంది.


పాక్‌పై తీవ్ర ప్రభావం..


ఇప్పటి దాకా పాకిస్థాన్ డ్యామ్‌ల్లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశాలు లేవు. భారత్ నీళ్లను ఆపితే.. ఆ దేశంలోని పంటలకు నీళ్లు సరిపోవు. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ఫ్రావిన్స్‌లో సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పట్టణాల్లో నీటి కొరత సంభవిస్తుంది. జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు కాబట్టి కరెంట్ కోతలు వేధిస్తాయి. ప్రజల్లో అసంతృప్తి పెరిగి.. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. భారత్ నీటి యుద్ధాలు చేస్తుందంటూ పాకిస్థాన్ పదే పదే ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల వద్ద మొరపెట్టుకోవచ్చు. కానీ ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు.. పాక్ ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి భారత్‌తో యుద్ధం చేసి గెలవాలి.. లేదంటే ఇండియాకు నచ్చినట్టు నడుచుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com