ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైనిక, భద్రతా ఆపరేషన్లపై మీడియా రిపోర్టింగ్ కు మార్గదర్శకాలు

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:47 PM

సైనిక కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.టీవీ ఛానళ్లు, వార్తా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా వినియోగదారులు సహా అందరూ రక్షణ, భద్రత సంబంధిత అంశాలపై వార్తలు ఇచ్చేటప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రస్తుత చట్టాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా సైనిక చర్యలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష దృశ్యాలను ప్రసారం చేయడం, సున్నిత ప్రాంతాల నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం, 'వర్గాల సమాచారం' పేరుతో వివరాలు వెల్లడించడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది.ఇలాంటి సున్నితమైన ఆపరేషన్ల వివరాలను ముందుగానే బయటపెట్టడం వల్ల శత్రు మూకలకు సమాచారం అందే ప్రమాదం ఉందని, ఇది ఆపరేషన్ల సమర్థతకు, భద్రతా సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై దాడులు, కాందహార్ విమాన హైజాక్ వంటి సమయాల్లో మీడియా కవరేజీ వల్ల జాతీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్నిబంధనలు-2021లోని రూల్ 6(1)(పి) ప్రకారం భద్రతా దళాలు నిర్వహించే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారాలను నిషేధించినట్లు మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలని పేర్కొంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com