ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ రోడ్లకు మహర్దశ..రూ.1,096 కోట్లతో విస్తరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:50 PM

రాష్ట్రంలో మౌలిక వసతుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందులో భాగంగా పోర్టుల సమీపంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు పోర్టులకు సమీపంలో జాతీయ రహదారులు ఉన్నాయి. అయితే ఈ జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులను అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోడ్లను విస్తరించి, అభివృద్ధి చేయటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.


జాతీయ రహదారుల నుంచి పోర్టులను చేరేందుకు ఈ రాష్ట్ర రహదారులను నిర్మించారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర రహదారులను విస్తరించేందుకు ఏపీ రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిజాంపట్నం, రామాయపట్నం, కళింగపట్నం, భావనపాడు, గంగవరం, రవ్వ పోర్టులకు అనుసంధానం చేసే 15 రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. వీటిలో కొన్ని3.75 మీటర్లు, మరికొన్ని 5.5 మీటర్లు, ఇంకొన్ని 7 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. అయితే అన్ని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాలని ఏపీ రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఇందుకు రూ.1,096.18 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.


15 రాష్ట్ర రహదారుల జాబితా


ఆర్అండ్‌బీ అధికారులు ఎంపిక చేసిన రహదారుల జాబితాలో ఎక్కువ శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. భావనపాడు, కళింగపట్నం పోర్టులను కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారికి విస్తరించే ఆరు రోడ్లను విస్తరించనున్నారు. కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం రోడ్డు, గార- చింతాడ రోడ్డు, కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రోడ్డు, కళింగపట్నం-పర్లాకిమిడి రహదారి, డోల- పోలాకి- నౌపడ మార్గం , నౌపడ- వెంకటాపురం రహదారి ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టును కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేసే.. ఎలమంచిలి- గాజువాక రహదారి, అనకాపల్లి- పూడిమడక రోడ్డుతో పాటుగా పరవాడ- అసకపల్లి రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రవ్వ పోర్టును కత్తిపూడి- ఒంగోలు జాతీయ రహదారికి అనుసంధానం చేసే.. అమలాపురం-చల్లపల్లి రోడ్డు, అనంతవరం- ఒల్లంకూరు రహదారి, కాట్రేనికోన-చల్లపల్లి రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇక నిజాంపట్నం పోర్టుకు వెళ్లే రేపల్లె- నిజాంపట్నం రోడ్డు, గుంటూరు-చీరాల రోడ్డు, మాచవరం-అల్లూరి-నిజాంపట్నం రోడ్లను కూడా విస్తరించనున్నారు. రామాయపట్నం పోర్టును అనుసంధానించే కందుకూరు- గుడ్లూరు -తెట్టు రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయాలని ఏపీ ఆర్అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com