ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం వస్తే.. ఏ ఏ ముస్లిం దేశాలు ఎవరికి మద్దతు ఇస్తాయి?

international |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:41 PM

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య 1947లో దేశ విభజన జరిగినప్పటి నుంచి తీవ్ర విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య పలుమార్లు యుద్ధం జరిగింది. అంతేకాకుండా అనేకసార్లు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా కాశ్మీర్, ఉగ్రవాదం విషయంలో భారత్‌ను పాక్ రెచ్చగొడుతూ అనేక చర్యలకు దిగుతోంది. వీటికి బదులుగా భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్‌కు గట్టిగానే బుద్ధి చెబుతోంది. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడూ కవ్విస్తున్న పాక్.. భారత్ సహనాన్ని పరీక్షిస్తోంది. పాక్ గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచి పోషించి.. ఆశ్రయమిస్తూ, దాన్ని భారత్‌ పైకి ప్రయోగించి రాక్షస ఆనందాన్ని పొందుతోంది. రోజురోజుకూ ఆ దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయి.. అడుక్కుతినే పరిస్థితికి వచ్చినా.. బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.


తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య తారస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు యుద్ధానికే దారి తీస్తాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణులు కూడా భారత్, పాక్ ఉద్రిక్తతల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ భారత్, పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే.. ముస్లిం దేశాలు ఎవరి పక్షాన ఉంటాయి అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అణుశక్తి కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే.. భారత్, పాక్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగిలిన దేశాలపైనా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయా ముస్లిం దేశాలు భారత్‌, పాక్ దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని.. ఏ దేశానికి మద్దతు ప్రకటించాలి లేదా తటస్థంగా ఉండాలనే నిర్ణయానికి రానున్నాయి.


సౌదీ అరేబియా


భారత్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఇంధన భద్రత ఒక ప్రధాన సమస్యగా ఉంది. సౌదీ అరేబియా నుంచి భారత్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతేకాుకండా భారత్‌లోని మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన వనరుల్లో సౌదీ అరేబియా పెట్టుబడులు పెడుతోంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ "విజన్ 2030"లో భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను బహిరంగంగా సౌదీ అరేబియా ఖండిస్తోంది.


యూఏఈ


గత 10 ఏళ్ల కాలంలో భారత్, యూఏఈ మధ్య సంబంధాలు ఎన్నడూ లేని విధంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యూఏఈ మారిపోయింది. అదే సమయంలో యూఏఈకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ మారింది. ఇదే కాకుండా యూఏఈలో భారీ సంఖ్యలో భారతీయ కార్మికులు పని చేస్తున్నారు. వీరి వల్ల రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇలాంటి పరిస్థితిలో భారతదేశ భద్రతకు వ్యతిరేకంగా ఉన్న ఏ దేశానికీ యూఏఈ మద్దతుగా నిలబడలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఇండోనేషియా


ఇండోనేషియా కూడా భారత్‌తో అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. సముద్ర భద్రత, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఇండోనేషియాకు భారత్ సహకారం అందిస్తోంది. ఇండోనేషియాకు భారత్ ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాకుండా స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా ఉంది.


ఈజిప్ట్‌


భారత్‌కు ఈజిప్ట్‌తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశంతో రక్షణ, విద్యలో భారత ప్రభుత్వం కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈజిప్ట్‌కు అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈజిప్ట్‌కు భారత్ స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతోంది.


బంగ్లాదేశ్


భారత్, పాక్ మధ్య యుద్ధం వస్తే.. బంగ్లాదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అయితే పూర్తిగా మద్దతు తెలిపేదే. కానీ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి.. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తోంది. బద్ధ శత్రువుగా ఉన్న పాకిస్తాన్‌తో చేతులు కలుపుతోంది. అయితే ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం.. బంగ్లాదేశ్ తటస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. నిరంతరం భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ యుద్ధం విషయంలో మాత్రం భారత్‌ను వ్యతిరేకించి, పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే ధైర్యం మాత్రం అక్కడి ప్రభుత్వం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే భారత్-పాక్ యుద్ధంలో బంగ్లాదేశ్ తటస్థ పాత్ర పోషించే అవకాశం ఉంది.


టర్కీ


టర్కీ కూడా భారత్, పాక్ యుద్ధం వస్తే అందులో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. సాంప్రదాయకంగా టర్కీ.. పాకిస్తాన్‌కు మద్దతుదారుగా ఉన్నప్పటికీ.. గత కొంత కాలంగా భారత్‌తో వాణిజ్యం, పర్యాటక రంగాల్లో దగ్గరవుతోంది. దీంతో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణను నివారించాలని కోరుకుంటోంది. ఇప్పటికే టర్కీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. దీంతో యుద్ధం వస్తే.. ఏ దేశానికి మద్దతు ఇచ్చినా.. టర్కీకి అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందిలు కలిగే అవకాశాలు ఉన్నాయి.


ఖతార్


ఖతార్ పరిస్థితి కూడా దాదాపుగా టర్కీలాగే ఉంది. ఖతార్‌లో భారీ ఎత్తున భారతీయులు పనిచేస్తున్నారు. రెండు దేశాలు గ్యాస్, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వీటికి తోడు ఖతార్ ప్రపంచ మధ్యవర్తిగా తన పాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో ఒక దేశానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఖతార్‌ దౌత్య స్థానాన్ని బలహీనపరుస్తుందని ఆ దేశం భావించవచ్చు. అందువల్ల


ఆఫ్ఘనిస్తాన్


చాలా కాలంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్‌ శరణార్థులను పాక్ తిరిగి వెనక్కి పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌లోని అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత్ పెట్టుబడులు పెట్టింది. దీంతో రెండు దేశాల మధ్య సహకారం పెరిగింది. అంతేకాకుండా ప్రతి క్లిష్ట సమయంలోనూ ఆఫ్ఘనిస్తాన్‌కు అండగా భారత్ నిలిచింది. కాబట్టి పాకిస్థాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అస్సలు మద్దతు తెలిపే అవకాశమే లేదు.


మలేషియా


పాకిస్తా్న్‌కు మలేషియాతో బలమైన సంబంధాలే ఉన్నాయి. కాశ్మీర్ విషయంలో మలేషియా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచింది. వీటికి తోడు మతపరమైన సాన్నిహిత్యం కూడా ఈ దేశాల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్తాన్‌కు రాజకీయంగా లేదా ఇతర రూపాల్లో మలేషియా మద్దతు తెలిపే అవకాశం ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లో ముఖ్యమైన సభ్యదేశంగా ఉంది. ఈ వేదికపై ఉన్న ఇతర ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్‌కు కొంత మేరకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే ఓఐసీలోని అన్ని దేశాలు ఒకే వైఖరిని కలిగి ఉంటాయని చెప్పలేము.


మరోవైపు.. ఇప్పటి వరకు ఏ దేశం కూడా పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యల పట్ల అంతర్జాతీయ సమాజం సానుకూల దృక్పథంతో ఉంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టడంలో భారత్‌ ఇప్పటికే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ వంటి దేశాలు ఈ ఉగ్రవాదం విషయంలో భారతదేశ వైఖరికి మద్దతు ఇచ్చాయి. అయితే చైనా మాత్రం పాకిస్తాన్‌కు పరోక్షంగా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com