కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న పిల్లలపై పిడుగు పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం కాత్రికిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు పిల్లలకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన పిల్లల మృతదేహాలను ఆదోని ఆసుపత్రికి తరలించారు. పిల్లలు అందరూ హైస్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేసవి కాలంలోనూ అకాల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులతో కూడిన వర్షాలు పడుతూ ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. వర్షం పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉంటే ఇంటిలోనే ఉండటం మంచిది. అలాగే తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. బహిరంగ ప్రదేశాలలో, చెట్ల క్రింద, లోహ వస్తువుల దగ్గర ఉండకూడదు. విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉండాలి. టీవీ, కంప్యూటర్, ఫోన్ ఛార్జర్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. పిడుగు పడితే విద్యుత్ లైన్ల ద్వారా షాక్ తగిలే ప్రమాదం ఉంది. దీంతో ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే బహిరంగ ప్రదేశంలో ఉంటే వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
ఇక వర్షం కురిసే సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటే... మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఆకాశంలో మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్ల లోపు శబ్దం వస్తే, పిడుగు పడిందని అర్థం, ఆ సమయంలో వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లాలి. జంతువులను ఇంటి లోపల లేదా సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. వర్షం, పిడుగుల గురించిన హెచ్చరికల కోసం వాతావరణ సూచనలను అనుసరించాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
![]() |
![]() |