ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోర్టులో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 700 మందికి గాయాలు

international |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:24 PM

ఇరాన్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌లో భారీ పేలుడు, అగ్నిప్రమాదం సంభవించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ భారీ పేలుడు, అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా.. 700 మందికి పైగా గాయపడినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. గాయపడిన వారిని.. సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బందర్ అబ్బాస్ నగరంలోని షహీద్ రజేయీ పోర్టు ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి పోర్టు పరిసరాల్లోని బిల్డింగ్‌లు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈ పోర్టు చుట్టూ కొన్ని కిలోమీటర్ల మేర అద్దాలు పగిలిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్, అమెరికా అధికారుల మధ్య ఒమన్‌లో మూడో రౌండ్ అణు చర్చలు ప్రారంభించిన సమయంలో ఈ ఘటన జరగడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


షహీద్ రజేయీ పోర్టులో కంటైనర్లలో రసాయనాలను సరిగా నిల్వ చేయకపోవడం కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని.. ఇరాన్ సంక్షోభ నిర్వహణ సంస్థ ప్రతినిధి హొస్సేన్ జఫారి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. కంటైనర్లలోని రసాయనాలే పేలుడుకు కారణమని ఆయన స్థానిక మీడియాకు వెల్లడించారు. గతంలో సంక్షోభ నిర్వహణ డైరెక్టర్ జనరల్ ఈ పోర్టును సందర్శించినప్పుడు.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.


మంటలు అంటుకునే రసాయన పదార్థాలను సరిగా నిర్వహించకపోవడమే పేలుడుకు కారణమని స్థానిక టీవీ అంతకుముందు ఆరోపించింది. పోర్టులో నిల్వ ఉంచిన అనేక కంటైనర్లు పేలడంతోనే ఈ పేలుడు జరిగిందని స్థానిక సంక్షోభ నిర్వహణ అధికారి మీడియాకు వెల్లడించారు. అయితే రసాయనాల వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు.


ఇక ఇరాన్ పేలుడుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పేలుడు తర్వాత 4 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను సంఘటనా స్థలానికి పంపించినట్లు హార్మోజ్గాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ చీఫ్ మొఖ్తార్ సలాహ్షౌర్ స్థానిక మీడియాకు వెల్లడించారు. పేలుడు స్థలం నుంచి భారీ ఎత్తున నల్లటి పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి.


బందర్ అబ్బాస్‌లోని ఈ పేలుడు ఇంధన వనరులపై ప్రభావం చూపలేదని నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. బందర్ అబ్బాస్‌లోని సౌకర్యాల వద్ద కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కొనసాగుతున్నాయని పేర్కొంది. బందర్ అబ్బాస్‌కు 26 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న ఖెష్మ్ ద్వీపంలో కూడా పేలుడు శబ్దం వినిపించిందని స్థానిక మీడియా తెలిపింది. బందర్ అబ్బాస్ పేలుడు ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com