ముంబై నటి జత్వానీకి సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు మరోసారి నోటీసులు జారీ చేసింది. మే 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. గతంలో ఈ అధికారులిద్దరూ ఇచ్చిన వాంగ్మూలాలకు, ప్రస్తుత విచారణలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు వెల్లడించిన అంశాలకు మధ్య వైరుధ్యాలు కనిపించడమే తాజా నోటీసులకు కారణంగా తెలుస్తోంది.ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, గతంలో కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలు వెల్లడించిన కొన్ని అంశాలను ఆయన ఖండించినట్లు సమాచారం. ముఖ్యంగా, జత్వానీని ముంబై నుంచి తీసుకురావాలనే టాస్క్ను తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఆంజనేయులు అప్పగించారని గతంలో విశాల్ గున్ని సీఐడీకి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను విశాల్ గున్నితో కేవలం నిఘా సంబంధిత విషయాలు మాత్రమే మాట్లాడి ఉంటానని... జత్వానీ విషయంపై విశాల్ గున్నితో కానీ, కాంతి రాణాతో కానీ తాను ఎలాంటి చర్చలు జరపలేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన విచారణలో స్పష్టం చేసినట్లు తెలిసింది.గతంలో కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలను సీఐడీ అధికారులు ఇదే కేసులో ప్రశ్నించారు. తాజాగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన వాంగ్మూలంతో, ఈ ముగ్గురి కథనాల్లో పొంతన కుదరడం లేదని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు, గత వాంగ్మూలాల్లోని అంశాలపై మరింత స్పష్టత కోసం కాంతి రాణా, విశాల్ గున్నిలను మరోసారి ప్రశ్నించాలని సీఐడీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే వారికి మే 5న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.
![]() |
![]() |