పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో అన్ని వేళ్లూ పాకిస్థాన్వైపే చూపిస్తున్నాయి. దాయాది అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఓవైపు భారత్ ఇప్పటికే దౌత్యపరమైన ఆంక్షలు, సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు, వాణిజ్యం నిలిపివేత వంటి నిర్ణయాలతో అష్టదిగ్బంధం చేస్తోంది. ఏ క్షణమైనా సైనిక చర్య జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ మంత్రులు సైతం భారత్ ప్రతీకార దాడికి సిద్ధమైందని ప్రకటిస్తున్నారు. ఇలాంటి సమయంలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో కునారిల్లుతున్న పాకిస్థాన్కు ప్రపంచ బ్యాంక్ భారీ ఉపశమనం కలిగించింది. ఆ దేశానికి ఏకంగా 108 మిలియన్ల డాలర్ల ఆర్ధిక సాయం విడుదల చేసింది.
వాయువ్య పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో మహిళలు, బాలికల జీవితాలను మెరుగుపరచడానికి 108 మిలియన్ డాలర్ల అదనపు నిధులను వరల్డ్ బ్యాంకు మంజూరు చేసింది. ఇందులో పఖ్తుంఖ్వా ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్మెంట్ కోసం 30 మిలియన్ డాలర్లు, ఖైబర్ పఖ్తుంఖ్వా రూరల్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్ట్ల కోసం 78 మిలియన్ డాలర్లు అందజేసింది. మార్కెట్లు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య సేవల అభివృద్ది కోసం ఈ నిధులు మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
ఈ నిధులను గ్రామీణ రహదారుల అప్గ్రేడ్, పునరుద్ధరణ ద్వారా సురక్షితమైన, వాతావరణానికి అనుగుణంగా ఉండే మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చుచేయాల్సి ఉంటుంది. తద్వారా పాఠశాలలు, ఆరోగ్య మౌలిక సౌకర్యాలు , మార్కెట్లు వంటి సేవలు, ఆర్దిక అవకాశాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల అభివృద్ధి లక్ష్యాల కోసం ఈ నిధులు మంజూరు చేసినట్టు వరల్డ్ బ్యాంకు ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.
‘‘ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా మహిళలు, బాలికలకు అవసరమైన సేవలు, ఆర్థిక అవకాశాల ప్రాప్యతను మెరుగుపరచడం ద్వారా ప్రావిన్సుల్లో ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది’" అని ప్రాజెక్ట్కు సంబంధించిన టాస్క్ టీం లీడర్ ముహమ్మద్ బిలాల్ పరాచా తెలిపారు. ఖైబర్ పఖ్తూంఖ్వా ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కు అదనంగా మంజూరైన 30 మిలియన్ అమెరికన్ డాలర్లు ప్రావిన్సుల్లో అందమైన పర్యాటక ప్రదేశాలకు చేరుకునే అవకాశాన్ని మెరుగుపరచేలా రెండు రహదారుల పునరుద్ధరణను పూర్తిచేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
పాకిస్థాన్ బుద్ధి ఏంటో ప్రపంచానికి తెలుసు.. అమెరికా షాకింగ్ కామెంట్స్
‘ఈ అదనపు ఆర్థిక సహాయం, ఖైబర్ పఖ్తూం ఖ్వా ప్రావిన్సు అభివృద్ధి లక్ష్యాలకు మద్దతివ్వడంలో వరల్డ్ బ్యాంక్ నిబద్ధతను హైలైట్ చేస్తోంది’ అని పరాచా పేర్కొన్నారు.
ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్.. ఇప్పటికే పలు దఫాలుగా వందల మిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంకు అందిస్తూనే ఉంది. అయితే ఈ సాయం ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో వివిధ అభివృద్ధి పథకాల పేరుతోనూ సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాదికి ఈ నిధుల మంజూరు ఊరటనిచ్చే అంశంగానే చెప్పవచ్చు,
![]() |
![]() |