ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారు ఆభరణాల ధరను ఎలా లెక్కిస్తారో తెలుసా

business |  Suryaa Desk  | Published : Thu, May 01, 2025, 12:02 AM

అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు, బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే, బంగారం ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్న ఈ తరుణంలో, మీరు కొంటున్న బంగారు ఆభరణాల అసలు ధర ఎంత ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇటీవల లక్ష రూపాయల మార్కును తాకి, ప్రస్తుతం 96 వేల రూపాయల పైన ట్రేడ్ అవుతోంది. మరి జ్యువెలర్లు మీ ఆభరణాల ధరను ఎలా లెక్కిస్తారో తెలుసా? బంగారం స్వచ్ఛత, రాళ్ల ధర, తయారీ ఛార్జీలు, పన్నులు, హాల్‌మార్కింగ్ ఛార్జీలు వంటి అనేక అంశాలు తుది ధరపై ప్రభావం చూపుతాయి.


హిందూ సంస్కృతిలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది సంపద, శ్రేయస్సును పెంచుతుందని చెబుతుంటారు. 'అక్షయ' అంటే ఎప్పటికీ తరగనిది. కాబట్టి, ఈ రోజున బంగారం కొనడం శాశ్వతమైన శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం. అయితే బంగారు ఆభరణాల ధర బయటకు కనిపించేదే ఉండదు. ఇక్కడ ఇతర చాలానే ఛార్జీలు ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం.


బంగారం మార్కెట్ రేటు: ఇది అత్యంత ముఖ్యమైన అంశం. బంగారం ప్రస్తుత మార్కెట్ ధర రోజువారీ మారుతూ ఉంటుంది. జ్యువెలర్లు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధరను ప్రాథమికంగా తీసుకుంటారు. ఆపై ఆభరణాల క్యారెట్ (22కేటీ, 18కేటీ లేదా 14కేటీ) ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు, 22కేటీ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. కాబట్టి, 22 క్యారెట్ బంగారం ధర 24 క్యారెట్స్ బంగారం ధరలో 91.6 శాతం ఉంటుంది. దీనిని ఆభరణంలోని మొత్తం బంగారం బరువుతో గుణిస్తారు.


తయారీ ఛార్జీలు: ఇవి ఆభరణాల రూపకల్పన, తయారీకి అయ్యే ఖర్చులను కలిగి ఉంటాయి. డిజైన్ల సంక్లిష్టతను బట్టి ఈ ఛార్జీలు మారుతుంటాయి. ఈ ఛార్జీలను బంగారం ధరలో నిర్ణీత శాతం లేదా స్థిర రేటుగా విధిస్తారు. జీఎస్‌టీ, ఇతర పన్నులు: తుది ధరపై (బంగారం, తయారీ ఛార్జీలు కలిపి) 3 శాతం జీఎస్‌టీ పడుతుంది. ఇది బిల్లు చివరలో యాడ్ చేస్తారు.


ఒక ఉదాహరణ ద్వారా బంగారు ఆభరణాల ధరను ఎలా లెక్కిస్తారో చూద్దాం. 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములు రూ. 96,500 అనుకుందాం. అప్పుడు 22KT బంగారం ధర 91.6 శాతం అంటే రూ. 88,394 అవుతుంది. మీరు 8.9 గ్రాముల బరువున్న బంగారు గొలుసు కొనాలనుకుంటే, దాని అసలు బంగారం ధర రూ. 78,670.66 (రూ. 8839.40 X 8.9 గ్రాములు) అవుతుంది.


సాధారణంగా జ్యువెలర్ గ్రాముకు రూ. 499 తయారీ ఛార్జీ విధిస్తుంటారు. ఈ లెక్కన మొత్తం 8.9 గ్రాములకు తయారీ ఛార్జీలు రూ. 4,441.10 (8.9 గ్రాములు X రూ. 499) అవుతుంది. కాబట్టి, బంగారు గొలుసు మొత్తం ధర రూ. 78,670.66 + రూ. 4,441.10 = రూ. 83,111.76 అవుతుంది. దీనిపై 3 శాతం జీఎస్‌టీ అంటే రూ. 2,493.35 అదనంగా వేస్తారు. హాల్‌మార్కింగ్ ఛార్జీలు రూ. 45 కలుపుకుంటే, తుది బిల్లు మొత్తం రూ. 85,650 అవుతుంది. అంటే పైకి కనిపించే బంగారం ధర కంటే దాదాపుగా రూ. 7 వేలు ఇక్కడ బంగారు గొలుసు కోసం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.


బంగారు ఆభరణాలు కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..


బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం, హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాల కోసం జ్యువెలర్ నుంచి తప్పనిసరిగా అసలైన బిల్లులు, ఇన్‌వాయిస్ తీసుకోవాలి. బిల్లులో హాల్‌మార్క్ చేసిన ఆభరణాల వివరాలు స్పష్టంగా ఉండాలి. మీరు కొంటున్న బంగారం స్వచ్ఛత చాలా ముఖ్యం. మీరు కొంటున్న బంగారం స్వచ్ఛతకు ధర సరిపోలుతుందో లేదో నిర్ధరించుకోవాలి. ఉదాహరణకు, మీరు 18KT బంగారం కొంటుంటే, దాని ధర 22 క్యారెట్ బంగారం ధర కంటే తక్కువగా ఉండాలి.


ఏప్రిల్ 1, 2023 నుంచి.. జ్యువెలర్లు 6-అంకెల హెచ్ యూఐడీ కోడ్‌తో కూడిన బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలి. హాల్‌మార్క్ చేసిన బంగారంపై BIS లోగో, స్వచ్ఛత గ్రేడ్, 6-అంకెల ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (యూఐడీ కోడ్) తప్పనిసరిగా ఉండాలి. మీరు BIS Care యాప్‌లో యూఐడీ కోడ్‌ను కూడా ధ్రువీకరించవచ్చు.


పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో మార్చుకోవడం చాలా సాధారణం. కొత్త బంగారు ఆభరణాలు కొనేటప్పుడు జ్యువెలర్ ఎక్స్ఛేంజ్ పాలసీలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కొంతమంది జ్యువెలర్లు ఎక్స్ఛేంజ్‌పై 100 శాతం బంగారం విలువను అందిస్తారు, కానీ నగదు రూపంలో 90 శాతం మాత్రమే ఇస్తారు. అలాగే, ఆభరణంలోని డైమండ్ లేదా ఇతర రత్నాలకు తిరిగి అమ్మకం విలువ ఉందో లేదో తనిఖీ చేయండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com