విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ఇవాళ(మంగళవారం) ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని ప్రార్ధిస్తూ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు భారత సైనికులకు తోడుగా ఉండాలని ఇవాళ దుర్గమ్మకు పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇండియన్ ఆర్మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ.. పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని దుర్గమ్మను కోరామని అన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పనిచేస్తుందని చెప్పారు. అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు మన సైనికులకు అండగా ప్రతి భారతీయుడు నిలిచారని గుర్తుచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘించి తెగబడిందని ధ్వజమెత్తారు. అయినా మన భారత సైన్యం వీరోచితంగా పోరాడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
![]() |
![]() |