ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ఎలాంటి అధికారిక పదవులూ చేపట్టను..: సీజేఐ సంజీవ్ ఖన్నా

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 07:54 PM

భారత 51 ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11వ తేదీన బాధ్యతలు చేపట్టగా.. నేటితో ఆయన పదవీ కాలం ముగిసింది. మంగళ వారం రోజే చివరి రోజు కాగా.. సుప్రీం కోర్టులో బెంచ్ కార్యకలాపాలు ముగిసిన తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తాను పదవీ విరమణ తర్వాత ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు అందరి ముందే వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


1960 మే 14వ తేదీన జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన.. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ఘనత సాధించారు. ఇలా పదవులు పొందిన వాళ్లు కొంత మందే కాగా.. అందులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒకరు. అయితే 2019లో జనవరి 18వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.


ఇదంతా ఇలా ఉండగా.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నాకు ఆయన స్వయానా సోదరుడి కుమారుడు. ముఖ్యమైన రాజ్యాంగ సంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తి పొందిన సంజీవ్ ఖన్నా.. న్యాయవాద వృత్తి వైపు మొగ్గు చూపారు. ఆయన బాటలోనే నడుస్తూ.. సీజేఐగా కూడా ఎంపిక అయ్యారు. అయితే ఈరోజుటితో ఆయన పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగానే నేడు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది.


రోజులాగే కోర్టుకు వచ్చిన సీజేఐ సంజీవ్ ఖన్నా.. బెంచ్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు. అక్కడే మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత తాను ఎలాంటి అధికారిక పదవులను చేపట్టబోనని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఈయన తర్వాత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీ.ఆర్ గవాయ్ పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మే 14వ తేదీన ఆయన ప్రమాణం స్వీకారం చేయనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com