ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక తెగుళ్లు, చీడపీడల బాధ ఉండదు.. సరికొత్త ఆవిష్కరణ

national |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 10:31 PM

ఒకప్పటి వ్యవసాయానికి.. ప్రస్తుత వ్యవసాయానికి చాలా మార్పులు వచ్చాయి. అత్యాధునిక వ్యవసాయ పద్దతులు, పంటలు ఇప్పుడు రైతులు సాగుచేస్తున్నారు. అయితే వ్యవసాయంలో టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతూనే ఉంది. అనేక రకాల యంత్రాలు వచ్చి.. వ్యవసాయంలో మనుషుల పనిని తగ్గిస్తోంది. ఇక పంటలకు మందులు పిచికారీ చేయడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే వ్యవసాయాన్ని మరింత సులువు చేసేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐఐటీ ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఒక స్పెషల్ రోబోను తయారు చేసింది. ఈ రోబో.. పంటలకు వచ్చే తెగుళ్లను గుర్తించి.. వాటికి అవసరమైన పురుగు మందులను స్వయంగా పిచికారీ చేస్తుంది. దీని వల్ల తెగుళ్లు, చీడపీడలతో బాధపడే రైతులకు ఇప్పుడు భారీ ఉపశమనం కలగనుంది.


ఈ రోబో వల్ల చీడపీడలు, తెగుళ్లు తగ్గి.. వ్యవసాయంలో దిగుబడి కూడా పెరుగుతుందని ఈ రోబోను తయారు చేసినవారు చెబుతున్నారు. ఆ రోబో డ్రోన్ల కంటే మెరుగ్గా పనిచేసి.. ఆ పంటలో మొక్కలకు వచ్చిన వ్యాధులను కచ్చితంగా గుర్తించి.. సరైన మందును ఎంచుకుని ఆటోమేటిక్‌గా పిచికారీ చేస్తుందని తేల్చి చెబుతున్నారు. దీనివల్ల రైతులు ప్రమాదకర రసాయనాల బారి నుంచి తప్పించుకోవచ్చని.. పంట దిగుబడిని కూడా పెంచుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సహకారం అందించిందని తెలిపారు.


 ఈ రోబోను తయారు చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్ దాని గురించి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆయన పర్యవేక్షణలో పీహెచ్‌డీ, ప్రాజెక్ట్ విద్యార్థుల బృందం ఈ అగ్రికల్చర్ రోబోటిక్ సిస్టమ్‌ను రూపొందించింది. 2018లో ప్రొఫెసర్ ప్రతిహార్‌కు వచ్చిన ఆలోచన.. వివిధ రకాల భౌగోళిక పరిస్థితులు కలిగిన వ్యవసాయ భూములకు అనుగుణంగా ఉండే ట్రాక్డ్ మొబైల్ మానిప్యులేటర్‌ను అభివృద్ధి చేయడానికి దారితీసింది. ఇది మనిషి చేతి వంటి సీరియల్ మానిప్యులేటర్ (రోబోటిక్ ఆర్మ్) వ్యవస్థను కలిగి ఉంది.


ప్రస్తుతం డ్రోన్ ఆధారిత వ్యవసాయ పరికరాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే అవి మొక్కల ఆకుల పూర్తి ఫోటోను తీయలేవు. అయితే ఈ రోబోలోని ట్రాక్డ్ మొబైల్ మానిప్యులేటర్‌ మాత్రం మొక్కల వ్యాధులను కచ్చితంగా గుర్తిస్తుంది. ఆ తర్వాత సరైన పురుగుమందును ఎంచుకుని.. అదే పిచికారీ కూడా చేస్తుంది. ఈ ఆటోమేటిక్ రోబో సిస్టమ్ అనేది వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక ముందడుగు అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com