ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత బ్రహ్మోస్ ముందు చైనా, పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎందుకూ పనికిరావు..: అమెరికా నిపుణుడు

international |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 11:46 PM

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను అమెరికా రక్షణ రంగ నిపుణుడు జాన్ స్పెన్సర్ సమర్థించారు. పాక్‌పై భారత్ చేసిన దాడి చూస్తుంటే.. రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు అనిపించిందని అన్నారు. ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతానికి అయినా, ఏ క్షణంలోనైనా సరే వెళ్లి భారత్ దాడి చేయగలదనే సందేశాన్ని ఆ దేశానికి పంపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత బ్రహ్మోస్ క్షిపణి ముందు పాకిస్థాన్, చైనా వైమానిక రక్షణ వ్యవస్థలు ఎందుకూ పనికి రావని చెప్పారు.


అమెరికా రక్షణ రంగ నిపుణుడు, మాడ్రన్ వార్ ఇన్‌స్టిట్యూట్‌లో అర్బన్ వార్‌ఫేర్ స్టడీస్ ఛైర్మన్‌గా పని చేస్తున్న స్పెన్సర్.. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు. భారత రక్షణ వ్యవస్థతో పోలిస్చే.. చైనా, పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా బలహీనమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ బ్రహ్మోస్ సామర్థ్యం ముందు అవి ఎందుకూ పనికి రావని అన్నారు. ముఖ్యంగా భారత్ దాడికి అవసరమైన దూకుడును ప్రదర్శిస్తూనే.. స్వీయ రక్షణ సామర్థ్యాన్ని చూపించిందని కొనియాడారు. పాక్ డ్రోన్ దాడులు, హై స్పీడ్ క్షిపణులను ఎదుర్కోవడంతో సహా తనతను తాను విజయ వంతంగా రక్షించుకోవడంలో ఇండియా పూర్తిగా సఫలం అయిందన్నారు.


ఒక్క ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పిందని.. ఎప్పుడైనా, ఆ దేశంలోని ఏ ప్రాంతానికి అయినా వెళ్లి దెబ్బకొట్టగలమని నిరూపించిందన్నారు. భారత్‌పై దాడికి చైనా వైమానికి రక్షణ వ్యవస్థను పాకిస్థాన్ ఉపయోగించిందని జాన్ స్పెన్సర్ తెలిపారు. అయితే అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయని వివరించారు. భారత సామర్థ్యం ముందు అవి ఏమాత్రం నిలవలేక పోయాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ సైన్యంపై గణనీయమైన నష్టాన్ని కల్గించిందని అన్నారు. అందుకు భారత దేశ అధునాతన సైనిక సామర్థ్యానికి నిదర్శనం అయిన బ్రహ్మోస్ క్షిపణి బాగా ఉపయోగ పడిందని చెప్పారు.


పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై యుద్ధంలో ఓ మలుపు అని స్పెన్సర్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను సైనిక వ్యూహకర్తలు, విద్యార్థులు రాబోయే సంవత్సరాల్లో అధ్యయనం చేస్తారని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఇతర దేశాలు ఆపరేషన్ సిందూర్‌ను పునరావృతం చేయగలవని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచం పాకిస్థాన్‌ను నిలదీయాల్సిన సమయం ఆసన్నం అయిందని.. పశ్చిమ దేశాలు వాటి రెండు వైపులా వాదాన్ని ఆపాలని అన్నారు. సింధూ నదీ జల ఒప్పందాన్ని నిలిపి వేయడం భారత దేశం తీసుకున్న తెలివైన నిర్ణయం అని మెచ్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com