ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం..: బెంజిమెన్ నెతన్యాహు

international |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 08:46 PM

గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. గాజాను ఆధీనంలోకి తీసుకునే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, విజయం సాధించాలంటే మనల్ని ఎవరూ అడ్డుకోలేరు అనే విధంగా వ్యవహరించాల్సి ఉంటుందని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ఇప్పటికే గాజాలో దాడుల తీవ్రతను పెంచిన ఇజ్రాయెల్, ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యాలు చేయడం గమనార్హం. దౌత్య కారణాలకు లోబడి గాజాలో కరువును నివారించాల్సిన అవసరాన్ని ఇజ్రాయెల్ గుర్తించిందని, ఇక వెనక్కి తగ్గేది లేదని, ఎట్టి పరిస్థితుల్లో గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు ఒక వీడియోను పోస్టు చేశారు.


మరోసారి ఇజ్రాయెల్ గాజాపై దాడుల తీవ్రతను పెంచింది. శనివారం అర్థరాత్రి సమయంలో నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది, ఖాన్‌యూనిస్‌లో 29 మంది.. మొత్తంగా 103 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు హమాస్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసినట్లు ఇటీవలె నెతన్యాహూ వెల్లడించారు.


గాజాలోని ఖాన్‌యూనిస్ నగరం సహా సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వాటిని ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. అయితే దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్‌ను పూర్తిగా బహిష్కరించాలన్న ప్రతిపాదనను ఇజ్రాయెల్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులు అంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే గాజా నుంచి వెళ్లడానికి, ఆయుధాలు అప్పగించడానికి హమాస్ సిద్ధంగా లేదని చర్చల సందర్భంగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.


ఇటీవల పశ్చిమాసియా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజా గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాను పాలస్తీనియన్లు పూర్తిగా ఖాళీ చేయాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇప్పుడు ఏకంగా గాజాను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. గాజా ఫోటోలు చూశానని, అక్కడ ఒక్క భవనమూ లేదని, కుప్పకూలిన భవన శిథిలాల కిందే ప్రజలు ఉంటున్నారని ట్రంప్ అన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. గాజాను అమెరికా నియంత్రణలోకి తీసుకుని స్వేచ్ఛా మండలంగా దాన్ని మలచాలని, గాజాపై తనకు మంచి ఆలోచనలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com