ఐపీఎల్లో అత్యధిక ధర పలికాడనే ఒత్తిడో.. లేదా ఇంకే కారణమో తెలీదు కానీ ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్లో అరంగేట్రం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఈ ప్లేయర్.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడాడు. దీంతో అతడి కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు పెట్టి పంత్ను దక్కించుకుంది. కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆశించింది. కెప్టెన్గా, వికెట్ కీపర్గా, బ్యాటర్గా పనికొస్తాడని అనుకుంది.
కానీ లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి అవుతోంది. ఈ సీజన్లో రిషభ్ పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్లు జరగ్గా.. అందులో ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ అదే చేశాడు. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాక వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చి సింగిల్ డిజిట్కే ఔట్ అయ్యాడు. దీంతో లక్నో ఫ్యాన్స్ను మరోసారి నిరాశపరిచాడు.
ఇషాన్ మలింగా బౌలింగ్లో అతడు పట్టిన స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్కు రిషభ్ పంత్ పెవిలియన్ చేరాడు. అయితే రిషభ్ పంత్ ఔటవ్వడం చూసి లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనానికి గురయ్యారు. “ఇంక నువ్వు మారవు” అన్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి.. బాల్కనీ నుంచి లోపలికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో 12 మ్యాచ్లలో 11 సార్లు బ్యాటింగ్ చేసిన అతడు.. కేవలం 135 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యా లాంటి ప్లేయర్లు సెంచరీలు కొడుతుంటే.. పంత్ మాత్రం క్రీజులో నిలిచేందుకే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి.
![]() |
![]() |