జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ప్రయోగించిన లైవ్ షెల్ను ఇండియన్ ఆర్మీ నిర్వీర్యం చేసింది. పూంచ్ సమీపంలోని ఓ గ్రామంలో రొడ్డు పక్కన ఉన్న లైవ్ షెల్ను స్థానికులు గుర్తించి.. సైన్యానికి సమాచారం అందజేశారు. తక్షణమే అక్కడకు బాంబు స్క్యాడ్ అక్కడకు చేరుకుని.. షెల్ను నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన స్థానికులు.. సైన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఘటన పూంచ్ జిల్లా దారా బగ్యాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొహమ్మద్ మషూక్ ఈ విషయంపై మాట్లాడుతూ: ‘పూంచ్ అంతటా భారత సైన్యం అద్భుతంగా పని చేస్తోంది. షెల్ రోడ్డుపక్కన ఉండగా, దగ్గరలో ఒక బస్తీ ఉంది. సైన్యం స్పందించి దాన్ని నిర్వీర్యం చేసింది. ఈ దారిలో వెళ్లేవారికి పెద్ద ప్రమాదం తప్పింది’ అని అన్నారు.‘ఈ బాంబు వల్ల మేము భయాందోళనలలో ఉన్నాం. కానీ భారత సైన్యం దాన్ని ధ్వంసం చేసింది. వారికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.
ఇటీవలి భారత్,పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నెలకున్న వేళ పాక్ సైన్యం సరిహద్దుల్లో పట్టణాలు, పౌర నివాసాలను టార్గెట్ చేస్తూ షెల్లింగ్లకు పాల్పడింది. ఈ దాడుల్లో చాలా నివాసాలు ధ్వంసమయ్యాయి, వారి పాడి పశువులు మృతి చెందాయి, రాజౌరీ జిల్లాకి చెందిన మోహమ్మద్ మాట్లాడుతూ: ‘షెల్లింగ్ వల్ల మా ఇల్లు పూర్తిగా నాశనమైంది.. ఉండటానికి చోటు లేదు.. మాకు గుడారాలు, తాత్కాలిక సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని కోరాడు. నౌషేరా వంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు తమ ఆదాయ మార్గాలైన పశువులనూ, భూములనూ కోల్పోయారు.
గత వారం జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి రాజౌరీ జిల్లాలోని సరిహద్దు గ్రామాలను సందర్శించి, బాధితులతో మాట్లాడారు. మే 7న ప్రారంభించిన "ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు భారత సైన్యం తగినరీతిలో బుద్దిచెప్పింది. గత నెలలో పహల్గామ్న ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ పరిణామాల అనంతరం పాకిస్థాన్ షెల్లింగ్, డ్రోన్లతో సరిహద్దు గ్రామాలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడింది. అయితే, పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టి భారత సైన్యం.. పాకిస్థాన్కు చెందిన రావల్పిండి నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్ వంటి కీలక వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. మే 10న ఇరుదేశాలూ కాల్పుల విరమణపై అంగీకరించాయి. అప్పటి నుంచి క్రమంగా ఉద్రిక్తతలు తగ్గి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకుంటున్నాయి. పాఠశాలలు మే 19 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సరిహద్దు ప్రజలు ఇప్పటికీ భయంతో జీవిస్తున్నారు.
![]() |
![]() |