ట్రెండింగ్
Epaper    English    தமிழ்

23 ఏళ్లకే 25 పెళ్లిళ్లు.. 7 నెలల్లోనే మొత్తం వివాహాలు

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:47 PM

ఉత్తర ప్రదేశ్ మహారాజ్‌గంజ్‌కు చెందిన 23 ఏళ్ల అనురాధ పాశ్వాన్‌కు కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే భర్త వద్ద ఉన్న ఈమె స్థానికంగా ఉండే ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేసేది. కానీ ఇంట్లో గొడవ జరగ్గా.. భర్తను వదిలేసి భోపాల్‌కు వెళ్లిపోయింది. అక్కడే స్థానిక ఏజెంట్ల ద్వారా పని చేసే వివాహ మోసగాళ్ల ముఠాకు చిక్కింది. అంటే ఓ నలుగురైదుగురు అమ్మాయిలను గ్రూపుగా ఏర్పాటు చేసి.. స్థానిక వివాహ ఏజెంట్లతో సంబంధాలు చూపిస్తారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలుగా వీరిని పరిచయం చేస్తూ.. పెళ్లిళ్లు ఆలస్యంగా అయ్యే యువకులే లక్ష్యంగా వీరితో వివాహాలు నిశ్చయిస్తారు. ఇలా పెళ్లిళ్లు ఫిక్స్ చేసి.. వివాహాలు కూడా జరిపిస్తారు. ఇందుకోసం 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా తీసుకుంటారు.


  అయితే ఇలా యువకులను పెళ్లిళ్లు చేసుకున్న మహిళలు.. వివాహం జరిగిన వారం వరకు అక్కడే ఉంటారు. ఆపై డబ్బు, నగలు సహా విలువైన ఇతర వస్తువులను తీసుకుని అర్ధరాత్రి ఇంటి నుంచి పరార్ అవుతుంటారు. ఇందుకు ముఠా సభ్యులు కూడా సాయం చేస్తుంటారు. ఇలా తప్పించుకున్న తర్వాత వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ మరో వ్యక్తిని పెళ్లి చుసుకుని.. ఇదే తంతు కొనసాగిస్తుంటారు. ఇలా అందినకాడికి దోచుకుంటూ వెళ్లిపోతుంటారు. అయితే మే 3వ తేదీన గుజరాత్‌లోని సవాయి నివాసి విష్ణు శర్మ తన భార్య ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా డబ్బు, నగలు సహా విలువైన ఇతర వస్తువులు కూడా దోచుకెళ్లినట్లు చెప్పారు.


అలాగే అనురాధతో తనకు పెళ్లి జరిపించడానికి ఏజెంట్లు సునీత, మీనాలకు రూ.2 లక్షలు చెల్లించినట్లు వివరించారు. అనురాధ మంచి అమ్మాయి అని చెప్పి.. ఏప్రిల్ 20వ తేదీన స్థానిక కోర్టులో వివాహం జరిపించారని పేర్కొన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా మే 2వ తేదీన విలువైన వస్తువులతో పారిపోయిందన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల ఆమె కోసం వేట సాగించారు. ఇలా ఆమె గుజరాత్‌లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. తమలోని ఓ కానిస్టేబుల్‌కు పెళ్లి కావడం లేదని.. అమ్మాయి కావాలంటూ, అతడికి సంబంధాలు చూడమని అనేక మంది ఏజెంట్లకు ఫొటోలు పంపారు. ఇలా ఓ వ్యక్తి అనురాధ ఫొటో పంపగా.. కానిస్టేబుల్ పెళ్లి కుమారుడిలా నటిస్తూ ఆమెను కలిసేందుకు వెళ్లాడు.


ఇలా పోలీసులు అద్భుతమైన ప్లాన్ వేసి మరీ ఆమెను సోమవారం రోజు అరెస్ట్ చేశారు. అయితే విష్ణు శర్మ తర్వాత కూడా ఆమె భోపాల్‌లో గబ్బర్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుని 2 లక్షలు తీసుకుని పారిపోయినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఆమెను పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఆమె 7 నెలల వ్యవధిలోనే అనేక రాష్ట్రాలకు చెందిన 25 మంది పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించింది. అలాగే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, నగలు కొట్టేసినట్లు కూడా వివరించింది. అలాగే ఈమెకు సహకరించిన గ్రూపు సభ్యులు రోష్ని, రుఘువీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జన్ అనే వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa