ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు?.. రాజీనామా యోచనలో మహమ్మద్ యూనస్!

international |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 08:18 PM

రిజర్వేషన్ల కోటా అంశంతో బంగ్లాదేశ్ రణరంగంగా మారగా.. 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ.. మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ దేశాన్ని విడిచి పారిపోయి వచ్చారు. ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటుండగా.. ఆ దేశాన్ని పాలించే బాధ్యతను నోబెల్ శాంతి గ్రహీత మహమ్మద్ యూనస్ చేపట్టారు. ముఖ్యంగా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మారి దేశాన్ని పాలిస్తున్నారు. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ నిర్మయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. మహమ్మద్ యూనుస్ త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) సహా ఇతర పార్టీలు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు విధానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి.


ఇది మాత్రమే కాకుండా బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్‌తో నెలకన్న విబేధాలు కూడా ప్రధానమైనవే. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకుంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. 2026 జూన్ నెలలో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంపై మాట్లాడుతూనే.. వకార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి చెప్పారు. అలాగే సైనిక వ్యవహారాల్లో జోక్యంపై కూడా అభ్యంతరం తెలిపారు.


దీంతో యూనస్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. 84 ఏళ్ల వయసు కల్గిన ఆయన వీటిని తట్టుకోలేకపోతున్నట్లు కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ ఇస్లామ్.. యూనస్ రాజీనామా గురించి గురువారం రోజు మీడియాతో మాట్లాడారు. ఈ వార్తల గురించి తాను కూడా విన్నానని.. అందుకే నేరుగా యూనస్ వద్దకే వెళ్లి కలిసినట్లు చెప్పుకొచ్చారు. అయితే యూనస్ కూడా రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని తనతో చెప్పారని పేర్కొన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను పని చేయలేనని వెల్లడించినట్లు వివరించారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాలని తాను ఆయనకు చెప్పినట్లు కూడా నహిద్ ఇస్లామ్ వెల్లడించారు.


అయితే యూనస్ రాజీనామా చేయకముందే.. దేశంలోని అన్ని పార్టీలు ఐక్యం అయి.. ఆయనకు సహకరించాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్ పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. దీంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడబోతుందని తెలుస్తుండగా.. అంతా ఆశ్చర్య పోతున్నారు. మరి తదుపరి అధిపతి ఎవరు అవుతారని, నేరుగా ఎన్నికలే నిర్వహిస్తారా లేక మళ్లీ తాత్కాలిక ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా అని ఆలోచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com